విద్యానగర్, మే 17 : పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా ఉంటున్నది. వారి పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ లేదా ఇద్దరిలో ఏ ఒక్కరికి వచ్చినా వారి పిల్లల సంరక్షణ కోసం ట్రాన్సిట్ హోంలను ఏర్పాటు చేస్తున్నది. చిన్నారుల సంరక్షణ బాధ్యతలను జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ట్రాన్సిట్ హోంలో చిన్నారులకు ఆశ్రయం కల్పించేందుకు ముందుగా చిన్నారులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ వస్తే వైద్యుల సూచనలు మేరకు హోం ఐసొలేషన్లో లేదా వైద్యశాలలో ఉంచుతారు. నెగిటివ్ వస్తే ట్రాన్సిట్ హోంలో చిన్నారులను ఉంచుతారు. వారి ఆలనా పాలన అంతా ఐసీడీఎస్ సిబ్బంది కంటికి రెప్పలా చూస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులు కల్పిస్తారు. తమ ఇంటిలో ఉండే వాతావరణాన్ని కల్పించి వారి బాగోగులు చూస్తారు.
కరోనా వేళ చిన్నారులకు అండగా..
తల్లిదండ్రులకు కరోనా వచ్చి ఒంటరి అయిన చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఒకవేళ ఇంట్లో అందరికీ కరోనా వస్తే వారి కుటుంబానికి నెలకు రూ.రెండు వేల ఇంటి సరుకులను అందజేస్తున్నది. కేవలం పిల్లలకు మాత్రమే పాజిటివ్ వస్తే హోం ఐసొలేషన్లో లేదా దవాఖానలో ఉంచుతారు. కరోనా విపత్కర వేళ రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. కరోనా సెకండ్వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది అనాథలుగా మారిన సందర్భాలూ ఉన్నాయి.పెద్దలకు కరోనా తగ్గేంత వరకు చిన్నారుల ఆలనాపాలన బాధ్యతలు తీసుకుంటున్నది. కామారెడ్డి జిల్లాలో రెండు ట్రాన్సిట్ హోంలను ఏర్పాటు చేశారు. బాలురకు మాచారెడ్డి మండలం భవానీపేట్లో, బాలికలకు దోమకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు.
చిన్నారుల సంరక్షణకు అన్ని వసతులు
ట్రాన్సిట్ హోంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నది. ఇంటి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నది. పౌష్టికాహారం, ఫిజియోలాజికల్ సపోర్ట్, రిక్రియేషనల్ ఆక్టివిటీ, వర్చువల్ కనెక్ట్ విత్ పేరెంట్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో పాటు టీవీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరి బాగోగులు చూసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రతి హోంలో డాక్టరు, నర్సులను నియమించనున్నారు. సకల సౌకర్యాలతో బెడ్లు, దుస్తులను, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. చిన్నారులను తరలించడానికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని 22 మండలాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి జూం మీటింగ్ ద్వారా కరోనా బారినపడి ఒంటరిగా ఉన్న చిన్నారుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం హెల్ప్లైన్ నంబర్ 1098 ఏర్పాటు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 040-23733665 హెల్ప్లైన్ నంబర్ను సమాచారం తెలుసుకోవడానికి ఉంచారు. ఈ హెల్ప్లైన్ నంబర్ ద్వారా కరోనా వచ్చిన గర్భిణులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమాచారం తెలుసుకోవచ్చు. కొవిడ్పై సందేహాలను నివృత్తి చేస్తారు.