అవసరమైతే గన్నీ సంచులు కొనుగోలు చేయాలి
లోడింగ్, అన్లోడింగ్పై నివేదికలు అందించాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, మే 28 : ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్ర భుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. ఇంకా 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాల్సి ఉందని, నాలుగు రోజుల్లోగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. గన్నీ సంచుల అవసరం ఉంటే కొనుగోలు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మిల్లుల్లో అన్లోడింగ్ జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను నియమించి వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం తరలింపు, అన్లోడింగ్ ప్రక్రియ పూర్తి వివరాలతో ప్రతి రోజూ నివేదిక అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్, జిల్లా మేనేజర్ గోపాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, మార్కెటింగ్ అధికారి గజానంద్, జిల్లా సహకార శాఖ అధికారి కృష్ణ, జిల్లా రవాణా శాఖ అధికారి కిష్ట య్య, మంచిర్యాల ఆర్డీవో వేణు, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏజెన్సీ, రైస్మిల్లర్లు, గుత్తేదారులు, లారీ అసోషియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.