వాషింగ్టన్: రోజంతా పెండ్లి ఫొటోలు తీసి అలసి, బాగా ఆకలితో ఉన్న ఫొటోగ్రాఫర్ను వివాహ విందు చేసేందుకు వరుడు అనుమతించలేదు. దీంతో చిర్రెత్తిన ఆ మహిళా ఫొటోగ్రాఫర్ ఉదయం నుంచి తీసిన పెండ్లి ఫొటోలు అతడి ముందే డిలీట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒక మహిళ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమం రెడ్డిట్తో పంచుకున్నది.
కిండా అనే మహిళ కుక్కల అలనాపాలనా చూస్తుంది. తన కస్టమర్ల డాగ్స్ను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇది చూసిన ఆమె మగ స్నేహితుడు తన పెండ్లికి ఫొటోలు తీయమని ఆమెను కోరాడు. 250 డాలర్లు మించి తాను ఇచ్చుకోలేనని చెప్పాడు. ఉదయం 11 నుంచి రాత్రి 7.30 వరకు అన్ని ఫొటోలు తీయాలని అతడు చెప్పగా ఆమె ఒప్పుకున్నది.
కాగా, మండు వేసవిలో, ఏసీలు లేని పెండ్లి వేదిక వద్ద ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమె పెండ్లి ఫొటోలు తీసింది. దప్పికతో తాను తెచ్చుకున్న రెండు బాటిళ్లలో నీళ్లు కూడా అయిపోయాయి. అక్కడ తాగు నీరు కూడా లేదు. ఒకవైపు అలసటతోపాటు ఆకలి ఆమెను దంచేస్తుంది.
దీంతో భోజనం తినేందుకు 20 నిమిషాల విరామం కోరింది. దీనికి వరుడు నిరాకరించాడు. ఫొటోగ్రాఫర్గా తమ వెంట ఉండాలి లేదా డబ్బులేమీ తీసుకోకుండా వెళ్లిపోవచ్చు అని అతడు చెప్పాడు. తన స్నేహితుడైన వరుడు చెప్పిన సమాధానానికి ఆమె ఆశ్చర్యపోయింది. అతడు నిజంగానే అలా అన్నాడా అని మరోసారి అడిగింది. దీనికి అతడు ఎస్ అని బదులిచ్చాడు.
దీంతో చిర్రెత్తిన ఆమె ఉదయం నుంచి కష్టపడి తీసిన పెండ్లి ఫొటోలను ఆ వరుడి ముందే డిలీట్ చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, నిజాయితీతో తనకు 250 డాలర్లను అతడు చెల్లించి, భోజనం పెట్టి ఉంటే పెండ్లి కానుకగా వాటిని తిరిగి ఇచ్చేదానినంటూ ఆమె వెల్లడించింది. తాను చేసింది సరైనదేనా అని నెటిజన్ల అభిప్రాయం కోరింది.
ఈ కథనానికి పలువురు స్పందించి ఆమెకు బాసటగా నిలిచారు. వరుడి తీరును కొందరు తప్పుపట్టారు. ఫొటోగ్రాఫర్కు కనీసం పెండ్లిలో భోజనం కూడా పెట్టలేరా అని మరి కొందరు ప్రశ్నించారు. స్నేహితుల కంటే కుక్కలే నయమని ఒకరు వ్యాఖ్యానించారు.