ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
46, 64వ డివిజన్లలో ప్రచారం
హాజరైన ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య
మడికొండ, ఏప్రిల్ 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మడికొండ చౌరస్తాలో 46, 64వ డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థులు మునిగాల సరోజన, ఆవాల రాధికారెడ్డి తరఫున శనివారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి, ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. దళిత్ ఎంపవర్మెంట్ పథకం కింద రూ.వెయ్యి కోట్లతో దళితులకు అండగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. 46, 64వ డివిజన్ల అభివృద్ధికి ఎమ్మెల్యేల నిధులతో పాటు ఎమ్మెల్సీ నిధులను కూడా తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
విభజన హామీలను తీర్చలేని బీజేపీ
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నా ఏడేళ్లుగా బీజేపీ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని ఓటెయ్యాలా? లేక తెలంగాణకు నిధులు కేటాయించారని ఓటెయ్యాలా? అంటూ బీజేపీని నిలదీశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కొత్త బిచ్చగాళ్లలా బీజేపీ నాయకులు వస్తారన్నారు. దేశంలో కాంగ్రెస్ కనుమరుగవుతోందన్నారు. తెలంగాణలో రెండు పంటలకు సాగునీరందించేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. దీనికి జాతీయ హోదా కల్పించాలని కోరితే ఒక్క రూపాయి కూడా సాయం చేసేందుకు బీజేపీ ముందుకు రాలేదని గుర్తు చేశారు. రౌడీలకు, భూ కబ్జాదారులకు ఓటు వేస్తే అభివృద్ధి జరుగదన్నారు. అభివృద్ధి కాంక్షించే అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.
మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య అన్నారు. రైతులకు ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికల నిర్మాణం చేపట్టి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జిలు మార్గం భిక్షపతి, సుదర్శన్ పాల్గొన్నారు.
రాంపూర్ గ్రామంలో..
46వ డివిజన్లోని రాంపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి మునిగాల సరోజన తరఫున ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల బడ్జెట్లో గ్రేటర్ వరంగల్కు సీఎం కేసీఆర్ రూ.250కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. గ్రేటర్పై టీఆర్ఎస్ జెండాను ఎగరేయడం ఖాయన్నారు. ఆరు నెలల్లోగా దేవాదుల నుంచి రాంపూర్ గ్రామంలోని కొచ్చెరువుకు నీటిని తెప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.