వాషింగ్టన్ : మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డలు తినడంతో అమెరికాలో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. 37 రాష్ట్రాల్లో 652 మంది అస్వస్థతకు గురికాగా, 129 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. అయితే అస్వస్థతకు గురైన వారి సంఖ్య అధికంగానే ఉంటుంది అని సెంటర్స్ ఫర్ డీసిజ్ కంట్రోల్ విభాగం తెలిపింది.
సాల్మోనెల్లా వ్యాప్తి కారణంగానే అస్వస్థతకు గురయ్యారని, లేబుల్ లేని ఎరుపు, తెలుపు, పసుపు రంగులో ఉన్న ఉల్లిగడ్డలను పారవేయాలని అధికారులు యూఎస్ ప్రజలకు సూచనలు చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 75 శాతం మందిని ఇంటర్వ్యూ చేయగా, పచ్చి ఉల్లిగడ్డలు తిన్న తర్వాతనే అస్వస్థతకు గురైనట్లు తేలింది. మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉల్లిగడ్డలను కొనుగోలు చేయొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. జులై 1 నుంచి ఆగస్టు 27 మధ్య దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డలను వాపస్ తీసుకునేందుకు మెక్సికోలోని ప్రోసోర్స్ కంపెనీ అంగీకరించింది.