హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు అవసరమైన ఎరువులను సిద్ధంగా ఉంచినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా భారీ విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉండటంతో అందుకనుగుణంగా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. వానకాలం సాగు, ఎరువులపై గురువారం మంత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సీజన్లో మొత్తం 25.50 లక్షల టన్నుల ఎరువులను కేటాయించినట్టు తెలిపారు. సీజన్ ప్రారంభానికి ముందే వీటిని రైతులకు అందుబాటులో ఉంచుతామని వివరించారు. ప్రస్తుతం 6.65 లక్షల టన్నులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇందులో 3.73 టన్నుల యూరియా, 2.92 టన్నుల ఇతర ఎరువులు ఉన్నట్టు తెలిపారు. కొత్తగా నిర్మించిన గోడౌన్లు పదిహేను రోజుల్లో అందుబాటులోకి వస్తాయని వివరించారు.