పెద్దేముల్, మార్చి 30 : తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. మంగళవారం మండల పరిధిలోని తట్టేపల్లి ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ పి.లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలో ముందస్తుగా తట్టేపల్లి పీఏసీఎస్ సీఈఓ రాజమౌళి ఎజెండా అంశాలను సభ్యులకు చదివి వినిపిస్తున్నారు. ఈ తరుణంలో పీఏసీఎస్ మాజీ డైరెక్టర్, సంఘ సభ్యుడు ప్రభుకుమార్ 1900 మంది సంఘ సభ్యులలో 10% శాతం (190 మంది) కూడా హాజరు కాకుండా సమావేశం ఏవిధంగా నిర్వహిస్తారని? బైలాస్ నియమాల్లో ఏ విధంగా ఉందో అలా నిర్వహించాలన్నారు. కొంతమంది సభ్యులు ఎల్టీ లోన్లు కట్టినా రశీదులు ఇవ్వకుండా బలవంతంగా మళ్ళీ లోన్లు ఎందుకు ఇస్తున్నారని, షేర్ అమౌంట్ ఎందుకు ఇవ్వడంలేదని సభలో సీఈవోను నిలదీశారు.
అందుకు సంబంధించి రికార్డులను తెప్పించి అందులో పరిశీలించాలని సభ దృష్టికి తీసుకురాగా.. నిరాకరించిన సీఈవో రికార్డులు తీసుకురావడం కుదరదని వాదించారు. దీంతో కాసేపు గందరగోళంగా మారి ఉద్రిక్తత నెలకొంది. అనంతరం సభావేదిక నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, సీఈవోలు పక్కకు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.అనంతరం చైర్మన్ పి.లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఓర్వలేక, రాజకీయంగా సర్వసభ్య సమావేశాన్ని తప్పుదోవ పట్టించారని, ఒక్కప్పుడు కోటి రూపాయలున్న సహకారం బ్యాంకు టర్నోవర్ ప్రస్తుతం రూ.12 కోట్లు ఉందని, త్వరలో రూ.83 లక్షల నాబార్డు నిధులతో గోదాముల నిర్మాణం, మరో రూ.50 లక్షలతో పెట్రోల్ పంపు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామన్నారు. ఈ సంవత్సరం కోటి రూపాయల రుణాలను రైతులకు అందించారన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అంజయ్య, డైరెక్టర్లు బస్వరాజ్, హన్మంతు, రహీం, శంకర్, శ్రీరాం, దిగంబర్, మాజీ డైరెక్టర్ ప్రభుకుమార్, సిబ్బంది జగదీశ్, నర్సింహులు, రాములున్నారు.తట్టేపల్లి పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగియడంతో సమావేశం అనంతరం విలేకరులో మాట్లాడుతూ సహకార బ్యాంకును సిబ్బంది, పాలకులు నాశనం పట్టిస్తున్నారని, త్వరలో దివాలా తీసే పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు.