కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఆ దేశ మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దేశం విడిచి పోయేందుకు పిల్లలు, కుటుంబంతో కలిసి మహిళలు పెద్ద సంఖ్యలో కాబూల్ ఎయిర్పోర్టుకు చేరుకుని మూసి ఉన్న గేట్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద సెక్యూరిగా ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులను మహిళలు ప్రాధేయపడుతున్నారు. ‘దయ చేసి సహాయం చేయండి.. తాలిబన్లు మా కోసం ఇళ్లకు వస్తున్నారు’ అంటూ మహిళలు చేసిన ఆక్రందనలు మిన్నంటాయి.
మరోవైపు కాబూల్ ఎయిర్పోర్ట్లోని అమెరికా, బ్రిటన్ సైనికుల మధ్య ఉన్న కంచె పైనుంచి కొందరు మహిళలు తమ పిల్లలను బ్రిటన్ సైనికులు ఉన్న వైపు విసిరేస్తున్నారు. తమ పిల్లలనైనా కాపాడి వారి వెంట తీసుకెళ్లాలని ఆ తల్లలు వేడుకుంటున్నారు. కొంత మంది పిల్లలు కిందపడకుండా బ్రిటన్ సైనికులు పట్టుకోగలిగినా, మరి కొంత మంది పిల్లలు కంచెకు చిక్కుకున్నారు.
కాగా, ఆఫ్ఘన్ మహిళల రోధనలు అమెరికా, బ్రిటన్ సైనికుల హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. అయితే వారు కూడా ఏ సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆఫ్ఘన్ మహిళల ఆక్రందనలను చూసి తమ సైనికులు రాత్రి వేళ ఏడుస్తున్నారని బ్రిటన్ ఆర్మీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ హృదయ విదారక దృశ్యాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.