కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం పేరిట గడిచిన ఏడు దశాబ్దాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎంతో గొప్పగా అమలు చేస్తున్నట్లు చెప్పినప్పటికీ ఈ వర్గాల్లో వెనుకబాటుతనం, పేదరికం మాత్రం పోలేదు. ఇప్పటికీ సమాజంలో అత్యంత పేదరికం అనుభవించే వారు ఎస్సీ, ఎస్టీలనే విషయం నిర్వివాదాంశం. రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక నిధులు, సబ్ ప్లాన్లు తదితర సదుపాయాలు, సౌకర్యాలు కల్పించామని చెబుతున్నప్పటికీ, వారి బతుకుల్లో మౌలికమైన మార్పు రావడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది.
సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి, ఖర్చు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం –2017 బిల్లును తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించి, ఖచ్చితంగా ఖర్చు చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు రూ.41,253.66 కోట్లు ఖర్చు చేసింది.
తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ ప్రభుత్వం 28 మార్చి, 2018న అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డు ఏరియాలో ఉండడంతో అవి ఎస్టీలకే రిజర్వు అయ్యాయి. ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసింది. దీంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం లభించింది. ఇంతపెద్ద మెత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి, గ్రామపరిపాలనా బాధ్యతలను ఎస్టీలకే అప్పగించే అభ్యుదయ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోతుంది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా గృహోపయోగ విద్యుత్ అందివ్వాలని 24 ఆగస్టు, 2018న ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు 50 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. టీవీల వినియోగంతోపాటు ఇతర విద్యుత్ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్ వాడకం ఎక్కువ కావడంతో 101 యూనిట్లకు పెంచారు.
మైక్రో ఇరిగేషన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ పథకం అమలు చేస్తున్నది.
గురుకులాలు: ఎస్సీలకు 134 గురుకులాలు (104 రెసిడెన్షియల్ పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలు), ఎస్టీల కోసం 51 గురుకులాలు ప్రారంభించారు.
మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానం ప్రవేశ పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో 25 మంది ఎస్సీ రైతులు, 10 మంది ఎస్టీ రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్లు కాగలిగారు. ఏజెన్సీ ఏరియాలోని 13 మార్కెట్లలో ఎస్టీలే చైర్మన్లయ్యారు.
ఎస్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు: ఎస్టీల కోసం కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 14 బాలికలు, 7 బాలుర కాలేజీలు వున్నాయి.
రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్లా కళాశాల మంజూరయ్యింది. ఇందులో ఐదేళ్ల లా కోర్సును 60 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సీట్లలో ఎస్టీ అభ్యర్థులకు 39, ఎస్సీ 6, బీసీలకు 7 సీట్ల చొప్పున కేటాయించారు.
ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టడీ సర్కిళ్లు ఎస్సీలకు కేవలం 1, ఎస్టీలకు 4 మాత్రమే వుండేవి. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాతవాటితో కలుపుకొని ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 స్టడీ సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లలో ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా 4,500 మంది నిరుద్యోగులకు వివిధ ఉద్యోగాల కోసం శిక్షణ ఇప్పించారు. అందులో 768 మంది ఉద్యోగాలు సాధించారు. దళితుల కోసం నిర్వహిస్తున్న స్టడీ సర్కిళ్లలో 75 శాతం ఎస్సీ అభ్యర్థులు, 10 శాతం ఎస్టీలు, 15 శాతం బీసీలకు అవకాశం కల్పిస్తున్నారు.
ఓవర్సీస్ స్కాలర్ షిప్స్: గతంలో ఒక్కో విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ కింద 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి, ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది.
ఎస్టీలకు మెయింటెనెన్స్ ఫీజు: ప్రభుత్వం ఎస్టీ విద్యార్థులకు వారి నిత్యావసర వస్తువుల ఖర్చుకై మెయింటెనెన్స్ చార్జీలను వారి విద్యార్హతను బట్టి గ్రూప్-1, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు (గ్రూప్-II), గ్రాడ్యుయేట్ కోర్సులు (గ్రూప్- III) మరియు ఇంటర్మీడియేట్ విభాగాలుగా విభజించి వారికి మెయింటెనెన్స్ చార్జీలు అందిస్తున్నది.
కళ్యాణలక్ష్మి: నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి భారంగా మారడంతో వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారు. వారింట్లో పెళ్లి సందర్భంగా ఒక్కొక్కరికి రూ.1 లక్షా 116 చెక్కును అందజేస్తున్నారు. 2021 మే వరకు 1,45,283 మంది ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ.1023.74 కోట్లు ఖర్చు చేసింది.
ఎకనామికల్ సపోర్టు స్కీమ్ (స్వయం ఉపాధి): ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని యువకులు స్వయం ఉపాధి పొందేందుకు అమలు చేస్తున్న ఎకనామికల్ సపోర్టు స్కీములో కూడా ప్రభుత్వం సబ్సిడీలు గణనీయంగా పెంచింది.
గుడుంబా బాధితులకు పునరావాసం : ఎస్సీ కుటుంబాలు గుడుంబా బారిన పడకుండా ఉండేందుకు పునరావాస పథకం కింద ఎక్సైజ్శాఖ 1,037 కుటుంబాలను గుర్తించింది. వారికి పునరావాస పథకాలను అమలు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. దాదాపు 30వేల కోట్ల రూపాయలతో వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అంటే, పేదల కోసం పెట్టే ఖర్చులో ఎక్కువ మొత్తం ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు నేరుగా అందుతున్నది.
ఆసరా పెన్షన్లు: రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇస్తున్న ఆసరా పెన్షన్లతో 4,66,167 మంది ఎస్సీలు, 2,34,817 మంది ఎస్టీలు లబ్ధి పొందుతున్నారు.
బీడీ కార్మికులు: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో బీడీ కార్మికులకు ఇస్తున్న భృతితో 27,034 మంది ఎస్సీలకు, 3,909 మంది ఎస్టీలకు లబ్ధి కలుగుతున్నది.
రుణమాఫీ: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీతో 6,01,024 మంది ఎస్సీలు, 4,57,474 మంది ఎస్టీలకు లబ్ధి కలుగుతున్నది.
ఫీజు రీ ఎంబర్స్ మెంట్: విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్ తో 2.5 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు, 1.27 లక్షల మంది ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
స్కాలర్ షిప్స్ : 2014 నుంచి 2021 మే వరకు 14,09,517 మంది ఎస్సీ విద్యార్థులకు రూ. 2470 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించడం జరిగింది.
2014 నుంచి 2021 మే వరకు 4,04,539 మంది ఎస్సీ విద్యార్థులకు రూ. 217 కోట్లు ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించడం జరిగింది.
ఎస్సీ హాస్టళ్ల నిర్వహణలో భాగంగా 4,43,825 మంది విద్యార్థుల కోసం రూ.1516.28 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,56,059 మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.3510 కోట్లు ఖర్చు చేసింది.
ఆరుకిలోల బియ్యం: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలందరికీ ప్రతి వ్యక్తికీ 6 కిలోల చొప్పున రూ.1 కిలో బియ్యం చొప్పున అందిస్తున్నారు.
సన్న బియ్యం: హాస్టళ్లు, స్కూళ్లలో 6,56,509 మంది ఎస్సీ విద్యార్థులు, 1,15,622 మంది ఎస్టీ విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.
ఆరోగ్యలక్ష్మి పథకం: ఆరోగ్య లక్ష్మి పథకం కింద 5,51,747 మంది ఎస్సీలు, 3,87,190 మంది ఎస్టీలు ప్రయోజనం పొందుతున్నారు.
మిషన్ భగీరథ : మిషన్ భగీరథ పథకం కింద 1,68,281 ఎస్సీ కుటుంబాలకు, 71,604 ఎస్టీ కుటుంబాలకు స్వచ్ఛమైన మంచినీరు అందుతున్నది.
పేద, వృద్ధ కళాకారుల పెన్షన్ : పేద, వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్ కింద 25 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు ప్రయోజనం పొందుతున్నారు.
పూర్తి సబ్సిడీపై ఎస్సీలకు రుణాలు: చిన్నపాటి వ్యాపారం చేసుకొనే ఎస్సీలకు పూర్తి సబ్సిడీతో రుణం అందించాలని ప్రభుత్వం 29 ఆగస్టు 2018న నిర్ణయించింది. ఎస్సీలకు 80శాతం సబ్సిడీతో రూ. లక్ష వరకు, 70శాతం సబ్సిడీతో రూ. 2 లక్షలు, 60శాతం సబ్సిడీతో రూ.10 లక్షల వరకు రుణాలిస్తారు. సబ్సిడీ పోగా మిగతాది లబ్ధిదారులు బ్యాంకు ద్వారా పొందాలి. ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకం కింద 1,36,043 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రూ.1,57,222 లక్షలు అందజేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ : 6872 లబ్ధిదారులకు ప్రభుత్వం 2684 లక్షలు ఖర్చు చేసింది.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్: ఈ పథకం కింద ఇచ్చే గ్రాంటును రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు ప్రభుత్వం పెంచింది. అలాగే, అర్హత కోసం వార్షికాదాయ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. 488 మంది ఎస్సీ విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది.
• కులాంతర వివాహాలు : చేసుకున్న 4,398 మంది లబ్దిదారులకు 22.10 కోట్లు ఖర్చు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించింది.
• దళితులకు 3 ఎకరాల భూమి : ఈ పథకం కింద మొత్తం 16,200 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, 6,422 మంది కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ భూముల పంపిణీ కోసం రూ.69,64,224 ఖర్చు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి