కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని పంజ్షీర్పై పట్టు సాధించినట్లు తాలిబన్లు ప్రకటించారు. కానీ రెబల్స్ మాత్రం భీకరంగా పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పంజ్షీర్ లోయను స్వాధీనం చేసుకునేందుకు తాలిబన్లు దూకుడును పెంచేశారు. అక్కడ హోరాహోరీగా రెండు వర్గాల మధ్య ఫైటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోవియట్ దళాలకు కూడా చిక్కని పంజ్షీర్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నట్లు రాయటర్స్ సంస్థ పేర్కొన్నది. పంజ్షీర్ సేనలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి. పంజ్షీర్ నేత అమ్రుల్లా సలేహ్ తానెక్కడికి వెళ్లలేదన్నారు. కానీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. పంజ్షీర్లో జరుగుతున్న ఫైటింగ్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు కొన్ని వార్తలు వెలుబడుతున్నాయి.
కాబూల్కు ఉత్తరం దిక్కున ఉన్న పంజ్షీర్ లోయ ఓ ప్రత్యేక ప్రావిన్సు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని తాలిబన్లు వశం చేసుకోలేకపోయారు. కానీ రెండు వారాల నుంచి సాగుతున్న పోరు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ లోయలో సుమారు రెండు లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. స్థానిక ట్రైబల్ లీడర్ అహ్మద్ మస్సౌద్ నేతృత్వంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పంజ్షీర్ దళాలు కదనరంగంలోకి దూకాయి. రెండు వైపుల సాయుధులు మరణించినట్లు సలేహ్ తెలిపారు. కానీ పోరాటాన్ని మాత్రం ఆపేదిలేదన్నారు.