సూర్యాపేట, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో కొవిడ్ పేషెంట్లకుఆక్సిజన్ కొరత రాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రాణవాయువును సరఫరా చేస్తున్నది. ఆక్సిజన్ ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్లను నియమించగా ప్రతి నిత్యం ఆక్సిజన్ వినియోగంపై ఆడిటింగ్ జరుపుతుండడం వల్లనే ఆక్సిజన్ కొరత చోటుచేసుకోవడం లేదు. ఇటీవల నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని జనరల్ ఆస్పత్రుల్లో 13 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు నిర్మించగా.. ప్రస్తుతం వాటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. శనివారం సూర్యాపేట జనరల్ దవాఖానకు 5.6కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్ను తెచ్చి నింపారు.
కొవిడ్ పేషెంట్లకు మెరుగైన సేవలు..
ప్రభుత్వం కొవిడ్ బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మెరుగైన వైద్యం అందిస్తున్నది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తుండగా, మన దగ్గర ఆ పరిస్థి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు రావడంతో ఆస్పత్రులు అప్గ్రేడ్ కావడం, మెడికల్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, సిబ్బంది పెరిగి వైద్య సేవలు అదేస్థాయిలో అందుతున్నాయి.
ప్రాణవాయువుకు కొరత లేకుండా..
కొవిడ్ బారినపడి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన బాధితులకు ఆక్సిజన్ అందించడమే అత్యంత ప్రధాన చికిత్స. వందలాది మంది బాధితులు జనరల్ ఆస్పత్రుల్లో ఉండగా ఇప్పటి వరకు ఆక్సిజన్ కొరత లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో సూర్యాపేటలో 50, నల్లగొండలో 70వరకు ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా ఎప్పటికప్పుడు ఖాళీ కాగానే వాటిని తిరిగి నింపి తీసుకొచ్చేవారు. ఆరు నెలల క్రితమే రెండు దవాఖానల్లో 13కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ కెపాసిటీతో ట్యాంకులను నిర్మించారు. ట్యాంక్ నుంచి ఆస్పత్రుల్లోని వార్డుల వారీగా బెడ్ల వరకు నేరుగా పైపులైన్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఆక్సిజన్ అవసరమయ్యే వారికి ఇబ్బందులు కలుగడం లేదు. సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో 160 మందికి ఆక్సిజన్ అందించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం 145 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆక్సిజన్ అవసరమైన 42 మందికి దాన్ని అందిస్తున్నారు.
ముందుచూపుతోనే తప్పిన కొరత
ఆక్సిజన్ వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఆడిటింగ్ నిర్వహిస్తుండడంతో ఆక్సిజన్ కొరత తప్పింది. కరోనా సెకెండ్ వేవ్ తరువాత సూర్యాపేటకు ట్యాంకర్ రావడం ఇది రెండోసారి. ఆక్సిజన్ ఐదు రోజులకు సరిపడా ఉండగానే ఇండెంట్ పెట్టడంతో వెంటనే ట్యాంకర్ వచ్చింది. ఇప్పటి వరకు సూర్యాపేటలో ఆక్సిజన్ కొరత రాలేదు. మున్ముందు కూడా వచ్చే అవకాశం ఉండదు.
-దండ మురళీధర్రెడ్డి, సూపరింటెండెంట్,సూర్యాపేట జనరల్ దవాఖాన