రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా పోలీస్ ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో కొన్ని పాత ప్రతిపాదనలు ఉండగా తాజాగా శివారు పోలీస్స్టేషన్లలో నెలకొన్న ఒత్తిడిని తగ్గించి వాటి స్థానంలో కొత్త పోలీసు స్టేషన్లను తీసుకురావడానికి పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొత్త పోలీస్ స్టేషన్ల అవసరం ఉన్న చోట ప్రస్తుతం పోలీస్స్టేషన్లలో ఉన్న పరిధిలో అక్కడ జరుగుతున్న నేరాలు, వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకున్ని ఉన్నతాధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఠాణాలతో పాటు తాజాగా పహాడిషరీఫ్ ఏసీపీ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ ఏసీపీ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం అనుమతికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త ఠాణాలు కొన్నింటిని ఈ ఏసీపీ డివిజన్ పరిధికి తీసుకురానున్నారు. ఇలా చేయడంతో ద్వారా ప్రజలకు వేగవంతమైన పోలీసింగ్తో పాటు నేర నియంత్రణకు తోడ్పడుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ముఖ్యంగా బాలాపూర్,పహాడిషరీఫ్ ప్రాంతాల్లో మయన్మార్ నుంచి వచ్చిన రోహింగాల కుటుంబాలు ఇక్కడ ఉంటుండడంతో పోలీసులకు పకడ్బందీ నిఘాకు పని ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఈ ప్రాంతాన్ని కొత్త పీఎస్లకు తీసుకువస్తే అక్కడ వారిపై నిఘా పెరిగి ఎలాంటి అసాంఘిక శక్తులు తిష్ట వేయకుండా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రక్రియను ప్రారంభించి ప్రతి పాదనలను రూపొందించి ప్రభుత్వం అనుమతి కోసం పంపనున్నారని తెలిసింది. ఈ కొత్త ఠాణాల ఏర్పాటుతో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా ఉండనున్నాయి. ప్రజలకు కూడా పోలీసులు అందుబాటులో ఉండడం వారిలో భద్రత పై మరింత భరోసాను కలిగిస్తుందని అధికారులు అంటున్నారు. పెట్రోలింగ్, గల్లీ గస్తీ పెరిగి నేరస్థులు, పోకిరీల్లో భయాన్ని పుట్టిస్తుందని పోలీసులు ఆశిస్తున్నారు.