కాబూల్, ఆగస్టు 14: ఆఫ్ఘస్థాన్లో తాలిబన్లు విరుచుకుపడుతూ రాజధాని కాబూల్ను కూడా చుట్టుముట్టిన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కుటుంబంతో పాటు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. శుక్రవారం ఘనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దానిని శనివారం ప్రసారం చేశారు. తాలిబన్ల ఆక్రమణ వల్ల దేశం పెనుముప్పును ఎదుర్కొంటున్నదని, అయినప్పటికీ పరిస్థితులు అదుపులో ఉన్నాయని ఘనీ అన్నారు. భద్రతా దళాలను బలోపేతం చేయడమే తమకు ప్రాధాన్య అంశమని చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని కూడా ఘనీ తెలిపారు. దేశ ప్రజలు నిర్వాసితులు కాకుండా చూస్తామని, యుద్ధం వల్ల ఇక ఎంతమాత్రం రక్తపాతాన్ని జరుగనివ్వనని చెప్పారు.
కాబూల్ శివార్లకు తాలిబన్లు..
తాలిబన్లు శనివారం మరో రెండు ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంతో పాటు కాబూల్ శివార్లకు చేరుకుని చుట్టుముట్టారు. కాబూల్కి దక్షిణాన ఉన్న లొగార్ ప్రావిన్స్ను ఆక్రమించిన తాలిబన్లు అధికారులను నిర్బంధించారు. కాబూల్కి 11 కిలోమీటర్ల దూరంలోని చార్ అస్యబ్ జిల్లాను కూడా తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆఫ్ఘాన్లో మొత్తం 34 ప్రావిన్సులు ఉండగా ఇప్పటి వరకు 19 ప్రావిన్సులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాబూల్ ఎయిర్పోర్ట్ ఒక్కటే మార్గం
రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబన్లు చుట్టుముట్టిన నేపథ్యంలో దేశం నుంచి పారిపోవాలనుకుంటున్నవారికి, అమెరికా తమ పౌరులను, దౌత్య సిబ్బందిని తరలించడానికి ఇక ఒకే ఒక మార్గం మిగిలింది. అదే కాబూల్ ఎయిర్పోర్ట్. తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు అమెరికా తాజాగా 3 వేల మంది బలగాలను తిరిగి ఆఫ్ఘన్కు పంపింది.