హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ…కొవిడ్ క్వారంటైన్ కేంద్రాలు మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నేచర్ క్యూర్, ఆయుర్వేద ఆస్పత్రులను కలెక్టర్ పరిశీలించినట్లు తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా భారీగా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు పెంచినట్లు వెల్లడించారు. అవసరమైతే మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ ఇప్పటికే టీకాలు వేసినట్లు, 45 ఏళ్లు పైబడిన అందరికీ కొవిడ్ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ నుంచి టీకా రక్షణ కల్పిస్తోందని పేర్కొన్నారు.