జెనీవా: కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే వ్యాక్సినేషన్( COVID vaccine )ను వేగంగా పూర్తి చేస్తున్న కొన్ని దేశాలు ఇక బూస్టర్ డోసుల వైపు చూస్తున్నాయి. ఎక్కువ కాలం ఈ మహమ్మారి నుంచి రక్షణ కోసం ఈ బూస్టర్ డోసులను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మాత్రం దీనిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడే బూస్టర్ డోసులు వద్దని వారిస్తోంది. డబ్ల్యూహెచ్వో హెడ్ టెడ్రోస్ అదనోమ్ మీడియాతో మాట్లాడుతూ.. ధనిక దేశాలు వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే 100 మందికి 100 డోసులు ఇస్తున్నాయి. అదే పేద దేశాలు మాత్రం వంద మందికి కేవలం 1.5 డోసులు మాత్రమే ఇచ్చాయి. వాళ్లకు వ్యాక్సిన్లు సరఫరా తగ్గి ఈ పరిస్థితి తలెత్తింది అని టెడ్రోస్ చెప్పారు.
ఈ పరిస్థితిని మనం అర్జెంటుగా మార్చాలి. ధనిక దేశాలకే మెజార్టీ వ్యాక్సిన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మెజార్టీ వ్యాక్సిన్లు పేద దేశాలకు వెళ్లాలి. అందుకే కనీసం సెప్టెంబర్ చివరి వరకైనా బూస్టర్ డోసులను ఆపాలి అని టెడ్రోస్ సూచించారు. ప్రతి దేశం కనీసం 10 శాతం జనాభాకు వ్యాక్సిన్లు ఇచ్చే వరకూ బూస్టర్ డోసుల జోలికి వెళ్లొద్దని ఆయన అన్నారు. ఆ దిశగా అన్ని దేశాల్లోని ప్రముఖులు ప్రచారం చేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.