1,98,367 ఓట్లతో గెలుపు బావుటా
ప్రథమ ప్రాధాన్య ఓట్లలో టాప్
ఎలిమినేషన్ రౌండ్లలోనూ భారీగా ఓట్లు
నల్లగొండ, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి భారీగా ఓట్లు సాధించారు. 54.14 శాతంతో 1,98,367 ఓట్లు తన ఖాతాలో వేసుకొని గెలుపు కోటాను దాటి ముందుకెళ్లారు. తీన్మార్ మల్లన్న 1,49,005 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆదివారం తెల్లవారుజాము వరకు స్వతంత్ర అభ్యర్థ్ధి తీన్మార్ మల్లన్న ఎలిమినేషన్ రౌండ్ కొనసాగింది. అనంతరం తుది ఫలితాలను అధికారులు ప్రకటించారు. మొత్తం ఓట్ల జాబితాతోపాటు విజయం సాధించినట్టు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అందుకున్నారు.
గులాబీ కంచుకోటలో ..
గులాబీ కంచుకోటగా ఉన్న నల్లగొండ పట్టభద్రుల స్థానంలో వరుసగా నాల్గోసారి టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఇదేస్థానం నుంచి రెండోసారి పల్లా రాజేశ్వర్రెడ్డి విజ యం సాధించారు. ఆదివారం ఉదయం తుది ఓట్ల జాబితాను రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ విడుదల చేశారు. కోదండరాం ఎలిమినేషన్ ప్రక్రియలో 12,806 ఓట్ల మెజార్టీతో పల్లా రాజేశ్వర్రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా పల్లాకు వచ్చిన మొత్తం ఓట్లను తేల్చేందుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు మల్లన్నను కూడా ఎలిమినేట్ చేశా రు. మల్లన్నకు వచ్చిన తొలి ప్రాధాన్య, ఆ తదుపరి ప్రాధాన్య ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుంటూ శనివారం అర్ధరాత్రి నుంచి ఓట్ల ను లెక్కించారు. ఆదివారం తెల్లవారుజాము న ఎలిమినేషన్ ముగిసింది. ఇందులో పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,98,367 ఓట్లు వచ్చాయి.
ఇది మొత్తం చెల్లిన ఓట్లలో 54.14 శాతం కావడం విశేషం. అంటే గెలుపు కోటాగా ఉన్న 1,83,167ను దాటి అదనంగా 15,200 ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా సాధించినట్లయ్యింది. కాగా, పల్లా తొలి ప్రాధాన్య ఓట్లలో మొత్తం 1,10,840 ఓట్లను సాధించి 27,455 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఆ తర్వాత ఎలిమినేషన్ రౌండ్స్లో ద్వితీయ, తదుపరి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనూ 87,527 ఓట్లను తన ఖాతాలో వేసుకుని ఘన విజయం సాధించారు. ఇక పల్లా చేతిలో ఓటమి పాలైన తీన్మార్ మల్లన్నకు వచ్చిన ఓట్ల నుంచి పల్లాకు భారీగా ద్వితీయ ప్రాధాన్య ఓట్లు రావడం విశేషం. మల్లన్నకు ప్రథమ ప్రాధాన్య ఓట్లు వేసిన 83,290 మందిలో పల్లాకు 37,186 మంది ద్వితీయ ప్రాధాన్య ఓటు వేశారు.
బీజేపీ అభ్యర్థి నుంచి పల్లాకు 31 శాతం ఓట్లు..
మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 68వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఎలిమినేషన్కు గురయ్యారు. దీంతో ఆయనకు వచ్చిన ప్రథమ ప్రాధాన్య ఓట్ల బ్యాలెట్లలోని ద్వితీయ ప్రాధా న్య ఓట్లను పల్లా రాజేశ్వర్రెడ్డి, మల్లన్న, కోదండరాంలకు పంచేశారు. ప్రేమేందర్రెడ్డికి మొత్తం 44,010 ఓట్లు రాగా.. కేవలం ప్రథ మ ప్రాధాన్య ఓటు మాత్రమే వేసిన 11,062 బ్యాలెట్లను పక్కన పెట్టారు. మిగతా వాటిని లెక్కించగా పల్లాకు 31.20 శాతంతో 10,282 ఓట్లు వచ్చాయి. బీజేపీ నేతలు ప్రభుత్వంపై, పార్టీ ముఖ్యలపై ఆరోపణలు చేస్తున్న క్రమంలో కూడా బీజేపీ అభ్యర్థి నుంచి పల్లాకు భారీగా ఓట్లు బదలాయింపు కావడం విశేషం.
ఎలిమినేషన్ రౌండ్లలో పల్లాకు వచ్చిన ఓట్లశాతం
బీజేపీ ప్రేమేందర్రెడ్డి నుంచి – 31%
్రప్రొఫెసర్ కోదండరాం నుంచి – 41%
తీన్మార్ మల్లన్న నుంచి – 44.64%