రామచంద్రాపురం, మే 3 : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్లో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ను సోమవారం నుంచి పాటిస్తున్నారు. గ్రామంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కరోనాను కట్టడి చేసేందుకు కౌన్సిలర్ చిట్టిఉమేశ్వర్, గ్రామపెద్దలు చర్చించుకుని సెల్ఫ్ లాక్డౌన్ పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారాలను కొనసాగించాలని, ఆ తర్వాత దుకాణాలను మూసివేయాలని సూచించారు. దీనికి గ్రామ పెద్దలు, వ్యాపారులు అంగీకరించారు. దుకాణాలు మూసివేయడంతో జనసంచారం తగ్గి కరోనా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని కౌన్సిలర్ అన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాత్రి 8 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. మండల కేంద్రం జిన్నారంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంటున్నాయి. ఉదయం పది తరువాత ప్రభుత్వ కార్యాలయాలు, మెడికల్ దుకాణాలు తెరిచి ఉంటున్నాయి.నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధించాలని గ్రామ సభలో తీర్మానం చేశారు.