ముంబై: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో నేరుగా చాట్ చేయడం, మాట్లాడటం సాధారణమైపోయింది. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శనివారం తన అభిమానులతో చాట్ చేశాడు. ఇంగ్లండ్ టూర్కు వెళ్లే ముందు ముంబైలోని హోటల్లో క్వారంటైన్లో ఉన్న విరాట్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అయితే ఈ ఫ్యాన్స్ మధ్యలో అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వచ్చింది. ముందు నా హెడ్ఫోన్స్ ఎక్కడ పెట్టావో చెప్పు అని అడిగింది.
దీనికి కోహ్లి స్పందిస్తూ.. ఎప్పుడూ పెట్టినట్లే మన బెడ్ పక్కనే పెట్టానని చెప్పడం విశేషం. దీంతోపాటు అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు కోహ్లి ఓపిగ్గా సమాధానమిచ్చాడు. తాను చివరిసారి ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో ట్రాన్స్ఫర్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినట్లు చెప్పాడు. ఇక తన కూతురు వామిక పేరుకు అర్థమేంటి, ఆమె ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదన్న ప్రశ్నకూ అతడు స్పందించాడు. దుర్గాదేవికి మరో పేరే వామిక అని, తన కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను బయటకు చూపించబోమని కోహ్లి చెప్పాడు.