ముషీరాబాద్, ఏప్రిల్ 9: ముషీరాబాద్ నియోజకవర్గం వీఎస్టీ-ఇందిరాపార్కు మార్గంలో చేపడుతున్న స్టీలు వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ అధికారులతో కలిసి స్టీలు వంతెన పురోగతిని పరిశీలించిన ఆయన ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వంతెన నిర్మాణ పనులు సాగుతున్న తీరు, అడ్డంకుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వాకబు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతోకాలంగా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడాలని ఎదురు చూస్తున్న ప్రజలకు స్టీలు వంతెన నిర్మాణంతో ఉపశమనం లభించనుందని అన్నారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 420 కోట్ల వ్యయంతో చేపడుతున్న వంతెన పనులను 2022 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఎమ్మె ల్యే తెలిపారు. వంతెన ఫేస్-1 వీఎస్టీ-ఇందిరాపార్కు మార్గంలో 75 పుట్టింగ్ లు, ఫేస్-2 రాంనగర్-బాగ్లింగంపల్లి మార్గంలో 33 పుట్టింగ్లు నిర్మించి కొంత ట్రాఫిక్ వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం పుట్టింగ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి పై వంతెన నిర్మా ణం చేపట్టనున్నట్లు తెలిపారు. స్టీలు వం తెన నిర్మాణం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా ఇంజినీరింగ్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పుట్టింగ్ నిర్మాణం కోసం చేపడుతున్న తవ్వకాల్లో వాటర్ లైన్లు, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ లైన్లు కొంత అవరోధంగా మారాయని, అయినా సదరు స మస్యలను అధిగమిస్తూ పనులు వేగంగా చేపడతామని అన్నారు.