న్యూఢిల్లీ : దేశ భద్రతను మోదీ సర్కార్ ప్రమాదంలో పడవేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో చర్చలు దండగమారి ప్రక్రియని వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అభివర్ణించారు. డ్రాగన్ తో అర్ధవంతంగా లేని చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం ఆయన ట్వీట్ చేశారు.
తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణకు చైనా విముఖత చూపుతోందన్న వార్తల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తూర్పు లడఖ్ లో సేనల ఉపసంహరణకు అంగీకరించిన చైనా ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తోందని కాంగ్రెస్ నేతలు మోదీ సర్కార్ ను ప్రశ్నించారు. సేనల ఉపసంహరణపై డ్రాగన్ తో జరిపిన చర్చలు ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ అంశంపై ప్రభుత్వం విస్పష్ట సమాచారంతో ముందుకురావాలని కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.