బెర్లిన్: దేశంలో మరో నెల రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని జర్మనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి కొవిడ్ టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు. అయితే పిల్లలు కరోనా టీకాలు వేయించుకోవడం తప్పనిసరి కాదని ఆమె స్పష్టం చేశారు. 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఫైజర్ లేదా బయోఎంటెక్ కొవిడ్ టీకాలు ఇవ్వడానికి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ శుక్రవారం ఆమోదించనుంది. ఇప్పటికే 16 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఓకే చెప్పింది.
జూన్ 7వ తేదీ నుంచి 12, అంతకు పైబడిన పిల్లలు లేదా యువత టీకాల కోసం నమోదు చేసుకోవచ్చని మెర్కెల్ చెప్పారు. కొత్త విద్యాసంవత్సరానికి ముందు ఆగస్టు నాటికి పిల్లలకు కొవిడ్ టీకా మొదటి డోసు ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలకు టీకాలు వేయడం ద్వారా వారిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. కెనడా, అమెరికాల్లో ఇప్పటికే 12 ఏళ్ల వయసు పైగా పిల్లలకు టీకాలు వేస్తున్నారు.
కాగా, కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, గాలి ఆడేలా గదులను ఉంచుకోవాలని మెర్కెల్ సూచించారు. దేశంలో ఇప్పటివరకు 40 శాతానికిపైగా మంది తొలి డోసు వేయించుకున్నారని, మరో 15 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారని తెలిపారు.