పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్, జూన్ 22: అమెరికన్ మిలిటరీ స్థావరాలకు పాకిస్థాన్లో ఆతిథ్యమివ్వబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగనున్న నేపథ్యంలో పాక్లో వాటికి ఆశ్రయం కల్పించనున్నారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అలా చేస్తే ఉగ్రవాదులకు తమ దేశం లక్ష్యంగా మారుతుందని, వాళ్లు తమపై ప్రతీకార దాడులకు దిగుతారని ఖాన్ చెప్పారు. దానిని భరించే స్థితిలో పాక్ లేదనీ, ఇప్పటికే తాము భారీ మూల్యం చెల్లించామని వివరించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగి ఉన్న అమెరికా.. ఆఫ్ఘాన్లో ఇరవై ఏండ్లు ఉండి యుద్ధాన్ని అంతమొందించనప్పుడు, బయట నుంచి (పాకిస్థాన్ నుంచి) ఎలా సాధిస్తుందని ఖాన్ ప్రశ్నించారు. సరిహద్దు దేశమైన అఫ్ఘనిస్తాన్తో తాము శాంతి కోరుకుంటున్నామే తప్ప యుద్ధం కాదని ప్రధాని స్పష్టం చేశారు.