నిజామాబాద్ లీగల్, మార్చి 25 : ఉమ్మడి జిల్లా ప్రజాప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగు తూ న్యాయ సేవలను వారందరికి చేరవేద్దామని ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కె.సాయిరమాదేవి అన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అదనపు అసిస్టెంట్ పోలీసు కమిషనర్స్, డివిజనల్ పోలీసు అధికారులు, రెవెన్యూ, అటవీ, జైళ్లు, అబ్కారీ శాఖల అధికారులతో నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపుహాల్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏప్రిల్ 10న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి అనుసరించాల్సిన విధివిధానాలను తెలియజేశారు. సమన్వయంతో ముందుకు సాగితేనే ఫలితాలను సాధించవచ్చన్నారు. అంతిమంగా అందరికీ న్యాయం చేకూర్చిన వారమవుతామని తెలిపారు. సామాజిక సమతుల్యాన్ని నిర్మించడంలో ప్రభుత్వ శాఖలు, న్యాయ వ్యవస్థ కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాజీకి వీలున్న అన్ని రకాల క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు కక్షిదారులను, ఫిర్యాదుదారులను, బాధితులను ఒప్పించి లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిర్చి సామరస్య పరిష్కారాన్ని అందజేద్దామని జిల్లా జడ్జి పేర్కొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం తరపున సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. అదనపు జిల్లా జడ్జిలు గౌతం ప్రసాద్, నర్సిరెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల వివాదాలతో సమాజానికి నష్టమేనని ఆ నష్టాన్ని పూడ్చడానికి సామాజిక కోణంలో ఆలోచించి లోక్ అదాలత్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి ఫలితాలు ప్రజలకు అందజేయాలన్నారు. సమావేశంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.