పారిస్: గతేడాది కరోనా విజృంభణతో గజగజ వణికింది ఫ్రాన్స్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో తొలి ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ క్రమంగా తగ్గిపోయింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో టీకా పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. దీంతో కొత్తగా నమోదవుతున్న కేసులూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నది. ఇప్పటికే లాక్డౌన్ ఎత్తివేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను కూడా నేటి నుంచి ఎత్తివేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కేస్టెక్స్ ప్రకటించారు. కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటంతో ముందుగా నిర్ణయించినదానికంటే 10 రోజుల ముందుగానే కర్ఫ్యూని కూడా రద్దుచేయనున్నట్లు చెప్పారు.
కొన్ని మినహాయింపులతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని ఎత్తివేస్తున్నామని కేస్టెక్స్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20 కరోనా కర్ఫ్యూని కూడా ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉందని వెల్లడించారు. కాగా, దేశంలో ఆరోగ్య పరిస్థితులు తాము అంచనాదానికంటే మెరుగ్గా ఉందని తెలిపారు. ఈ వేసవి చివరినాటికి 35 మిలియన్ల మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇది దేశ జనాభాలో సగానికంటే అధికమని వెల్లడించారు.