పారిస్ : బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను ఈనెల 17 నుంచి తొలగిస్తున్నట్టు ఫ్రాన్స్ బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కావడంతో ఈనెల 20 నుంచి కరోనా కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని మినహాయింపులతో గురువారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలనే నిబంధనను ఎత్తివేస్తున్నామని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు.
దేశంలో ఆరోగ్య పరిస్థితి తాము ఆశించినదాని కంటే వేగంగా మెరుగవుతోందని కాస్టెక్స్ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసమ్మర్థ ప్రదేశాలు, స్టేడియంలు వంటి ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో మాత్రం మాస్క్ లు ధరించాలని చెప్పారు. ఫ్రాన్స్ లో మంగళవారం రోజువారీ సగటు కేసులు అత్యంత కనిష్టంగా 3200గా నమోదయ్యాయి. 2020 ఆగస్ట్ తర్వాత కరోనా కేసులు ఈ స్థాయిలో దిగిరావడం ఇదే తొలిసారి.