న్యూఢిల్లీ, మే 13: నిన్నమొన్నటిదాకా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఇప్పుడు పరుగందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో తులం విలువ రూ.50,000లను తాకవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే 12-15 నెలల్లో రూ.56, 500లకు చేరవచ్చనీ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెప్తున్నది. గతేడాది మునుపెన్నడూలేని రికార్డు స్థాయిని పసిడి ధరలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం పుత్తడి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. గోల్డ్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల అనిశ్చితి నడుమ ధరలు దిద్దుబాటుకు గురవటం, కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయంగా మారడం, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు ఇవన్నీ బంగారం మార్కెట్ను దెబ్బతీశాయి. అంతేగాక ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్), కమాడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (సీఎఫ్టీసీ) పొజీషన్లలో లాభాల స్వీకరణ సైతం కొనుగోళ్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ పుత్తడి మార్కెట్ జోరందుకున్నది. ఇందుకు మదుపరులలో తిరిగి బలపడిన పెట్టుబడుల ఆసక్తే కారణం. అందుకు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) లెక్కలే ఉదాహరణ. ఈ ఏడాది జనవరి-మార్చిలో గనులలో ఉత్పత్తి పెరిగినా.. కరోనా లాక్డౌన్ల మధ్య మార్కెట్కు సరఫరా మాత్రం 4 శాతం తగ్గింది. ఇదే క్రమంలో ఆభరణాల డిమాండ్ 52 శాతం పెరుగగా, కడ్డీలు, నాణేలపై పెట్టుబడులు 36 శాతం ఎగిశాయని డబ్ల్యూజీసీ వెల్లడించింది. గతేడాదితో పోల్చితే దేశవ్యాప్తంగా కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమల్లో లేకపోవడంతో సైప్లె కంటే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తున్నది. దీంతో మార్కెట్లో ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది.
బంగారం కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతకొద్ది నెలలుగా దిద్దుబాటుకు లోనైన మార్కెట్.. ఇప్పుడు పరుగందుకున్నదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం 1,800 డాలర్ల వద్ద కదలాడుతున్న ఔన్సు బంగారం ధర.. వచ్చే ఏడాది ఆఖరుకల్లా 2,050 డాలర్లు, ఆ తర్వాత 2,200 డాలర్ల స్థాయికి చేరగలదని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో దేశీయంగా 10 గ్రాముల ధరలు రూ.58,000, ఆపై రూ.60,000లను తాకినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. కాబట్టి పుత్తడి కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు వెంటనే కొనడం మంచి నిర్ణయమని వారు సలహా ఇస్తున్నారు.
ఈసారి అక్షయ తృతీయ (శుక్రవారం)కు లాక్డౌన్ సెగ తగులుతున్న నేపథ్యంలో డిజిటల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మదుపరుల పెట్టుబడి సొమ్ముతో ట్రేడింగ్ కంపెనీలు బంగారాన్ని కొని సెక్యూర్డ్ వాల్ట్స్ల్లో మీ పేరిట నిల్వ చేస్తాయని, అవసరమైనప్పుడు దాన్ని నగలు, నాణేలు, బులియన్గా మార్చుకోవచ్చని చెప్తున్నారు. ఆన్లైన్ రుణాలకు తాకట్టుగా కూడా ఈ డిజిటల్ గోల్డ్ పనికి వస్తుందని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆగ్మంట్ గోల్డ్, ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియా, డిజిటల్ గోల్డ్ ఇండియా సంస్థలు ఈ డిజిటల్ గోల్డ్ను ‘సేఫ్గోల్డ్’ బ్రాండ్ పేరుతో ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సైతం గురువారం సేఫ్గోల్డ్ భాగస్వామ్యంతో తమ కస్టమర్ల కోసం ‘డిజీగోల్డ్’ వేదికను ప్రారంభించింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా 24 క్యారెట్ల బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపింది.