లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలి
ఐసొలేషన్ కేంద్రాలు పెంచాలి
మానుకోట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, మే 13 : ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ విధించారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, ధరంసోత్ రెడ్యానాయక్, హరిప్రియానాయక్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డితో కొవిడ్-19 నియంత్రణ, పాజిటివ్ కేసుల తగ్గింపునకు చేపట్టాల్సిన ప్రణాళికపై మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్-19 లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కరోనా రోగులపై నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. లాక్డౌన్ ఉన్నా వ్యవసాయానికి సంబంధించిన పనులు, ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. కరోనా పరీక్షల సామర్థ్యం పెంచి, ఐసొలేషన్ సౌకర్యాలను సైతం పెంచాలన్నారు. మరణాలను ఎలా అరికట్టాలి…? కరోనా బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి…? అనే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను నిర్ధిష్ట పద్ధ్దతిలో వినియోగించుకోవాలని సూచించారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇంటింటికీ జరుగుతున్న జ్వర సర్వే సమగ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్యాధికారులు పాల్గొన్నారు.