లండన్: యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి శౌర్య పురస్కారం పొందిన బ్రిటీష్ మాజీ సైనికుడు షాన్ గ్యారీ జార్డిన్, సొంత ఇంటి కోసం ఆ మెడల్ను వేలం వేశారు. బ్రిటీష్ సైన్యంలో రెండో అతి పెద్ద శౌర్య పురస్కారమైన కాన్స్పీక్యూస్ గాలంటరీ క్రాస్ (సీజీసీ)ను డీఎన్డబ్లూ ద్వారా వేలం వేయగా 140,000 పౌండ్లకు (రూ.1.43 కోట్లకు) బుధవారం అమ్ముడు పోయింది. బ్రిటీష్ శౌర్య పతకాలను సేకరించే ఒక ప్రైవేట్ వ్యక్తి దీనిని దక్కించుకున్నారు. కాగా ఇంత పెద్ద మొత్తానికి తన మెడల్ అమ్ముడు పోవడంపై జార్డిన్ సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబం కోసం సొంత ఇంటిని కొనుగోలు చేయాలన్న తన కల నెరవేరబోతున్నదని ఆయన తెలిపారు.
కాగా, బ్రిటీష్ ఆర్మీలోని స్కాటిష్ రెజిమెంట్కు మాత్రమే సీజీసీ మెడల్ను బహూకరిస్తారు. స్కాట్లాండ్కు చెందిన జార్డిన్ 16 ఏండ్ల వయసులో బ్రిటీష్ సైన్యంలో చేరారు. 2003లో 21 ఏండ్ల వయసులో ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. క్విక్ రియాక్షన్ ఫోర్స్ ఫైర్ టీమ్కు లీడర్గా ఉన్న జార్డిన్ ఒంటి చేతితో ముగ్గురు శత్రు సైనికులను హతమార్చారు. ఇరాక్ యుద్ధంలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బ్రిటీష్ ఆర్మీ సీజీసీ మెడల్తో సత్కరించింది. అనంతరం ఆర్మీ నుంచి రిటైర్ అయిన జార్డిన్, సొంత ఇంటి కొనుగోలుకు తన శౌర్య పురస్కారాన్ని వేలం వేశారు.