శంషాబాద్ రూరల్, జూలై 1 : తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. గురువారం నానాజీపూర్లో నిర్వహించిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్జైన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్తో కలిసి నానాజీపూర్లోని దళిత వాడలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి నేరుగా గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని పరిశీలించారు. అనంతరం హరితహారం, పల్లెప్రగతిపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని దళితులను ఆర్థికంగా ఆదుకొని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత నెల 27న దళిత సాధికారిక పథకంపై అన్ని పార్టీల నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
దళితులను ఆదుకోవడం కోసం నియోజకవర్గంలో 100మంది నిరుపేద దళితులకు రూ. 10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడానికి రూపకల్పన చేశారని, వాటిని త్వరలో నేరుగా వారికి అందజేస్తారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పల్లెలు పరిశుభ్రంగా మార్చాలనే లక్ష్యంతో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. నానాజీపూర్ గ్రామంలో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల సమస్యలు ఉన్నాయని గ్రామ సర్పంచ్ కల్పన సింహారెడ్డి వివరించారు. స్పందించిన ఆయన మళ్లీ ఆగస్టు 1వ తేదీన తిరిగి నానాజీపూర్ గ్రామానికి వస్తాను అప్పడు ఏ సమస్యలు లేకుండా చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిక్జైన్ ఆదేశించారు.
అనంతరం అడిషనల్ కలెక్టర్ ప్రతిక్జైన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తే పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గ్రామాల పరిశుభ్రతకు పెద్దపీట వేసి గ్రామాలను ఆదర్శంగా తయారు చేస్తున్నారన్నారు. హరితహారంలో భాగంగా చెట్లను నాటి వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. శంషాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలో 111జీవోను ఎత్తివేసి ఇక్కడి ప్రజల ఇబ్బందులను తొలగించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కోరారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, శంషాబాద్ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, ఎంపీడీవో వినయ్ కుమార్, తహసీల్దార్ జనార్దన్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నానాజీపూర్ గ్రామంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ స్థానిక సర్పంచ్ కల్పనసింహారెడ్డి గ్రామంలోని సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం కోసం నిధులు కావాలని కోరడంతో స్పందించిన సీఎస్ రూ. 85లక్షలు ప్రతిపాదనలు ఇచ్చి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీవో వినయ్కుమార్ తెలిపారు. రూ. 85లక్షలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు ఇవ్వడంతో సర్పంచ్, ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు, నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రాయన్నగూడలోని పల్లెప్రకృతి వనాన్ని పరిశిలించి సోమేశ్ కుమార్ మొక్కలు నాటారు.