వాషింగ్టన్: అమెరికాలో మరో వైరస్ కలకలం రేపింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తొలిసారి మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. టెక్సాస్కు చెందిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించినట్లు ఆ దేశానికి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం తెలిపింది. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఆ వ్యక్తికి అక్కడ మంకీపాక్స్ వైరస్ సోకి ఉంటుందని తెలిపింది. ఆ వ్యక్తి ప్రస్తుతం డల్లాస్లోని ఆసుపత్రిలో ఐసొలేషన్లో ఉన్నట్లు వివరించింది.
ఈ నెల 8,9 తేదీల్లో ఆ వ్యక్తి ప్రయాణించిన రెండు విమానాల్లో అతడితో కలిసి ఉన్న ఇతర ప్రయాణికులను ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఎయిర్లైన్స్, స్థానిక ఆరోగ్య సంస్థలతో కలిసి ప్రయత్నిస్తున్నట్లు సీడీసీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక వ్యక్తికే మంకీపాక్స్ సోకినందున సాధారణ ప్రజలకు ఎలాంటి వ్యాప్తి ముప్పులేదని తెలిపింది. 2003లో అమెరికాలో 47 మందికి మంకీపాక్స్ సోకినట్లు వెల్లడించింది. ఇరవై ఏండ్లలో ఇదే తొలి కేసు అని సీడీఎస్ పేర్కొంది.
కాగా, మంకీపాక్స్ కూడా స్మాల్పాక్స్ (మశూచి) జాతికి చెందిన వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వైరల్ అనారోగ్యం ఇది. మంకీపాక్స్ వైరస్ ఎక్కువగా ఎలుకలు, జంతువులలో మనుగడ సాగిస్తుంది. అయితే కొన్నిసార్లు జంతువుల నుంచి మానవులకు ఇది వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ సోకిన వారిలో తేలికపాటి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. జలుబు, లింఫ్ నాడుల్లో వాపు, ముఖం-శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ అంటువ్యాధి రెండు నుంచి నాలుగు వారాలపాటు ఉంటుంది. శ్వాసకోశ బిందువుల ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఇది వ్యాపిస్తుంది.