వాషింగ్టన్: తల్లి మృతదేహాన్ని ఉంచే శవపేటికలో మరో వ్యక్తి మృతదేహాం ఉండటం చూసి ఆ కుటుంబం షాక్ అయ్యింది. అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఈ ఘటన జరిగింది. గత నెలలో ఇద్దరు సిస్టర్స్ అయిన జెన్నిఫర్ టేలర్, జెన్నెట్టా ఆర్చర్ తల్లి మేరీ ఆర్చర్ చనిపోయారు. దీంతో ఈ నెల 7న తల్లి అంత్యక్రియల కోసం అహోస్కీలోని హంటర్ అంత్యక్రియల గృహాన్ని వారు సంప్రదించారు. అయితే తల్లి మృతదేహాన్ని ఉంచాల్సిన పేటికలో మరో మహిళ మృతదేహాన్ని చూసి వారు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని సంబంధిత నిర్వాహకులకు చెప్పారు.
అయితే ఆ శవ పేటికలో ఉన్న మహిళ మృతదేహాం వారి తల్లిదేనంటూ సిబ్బంది తొలుత వాదించారు. దీనిపై ఆ సిస్టర్స్ గట్టిగా నిలదీయగా, వారి తల్లి మృతదేహం ఎంబామింగ్ గదిలో ఉన్నట్లు సిబ్బంది గ్రహించారు. అయితే మృతదేహాల తారుమారు గురించి ఎంబామింగ్ ఏర్పాట్లు చేసే నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయలేదని, మాట వరుసకైనా పొరపాటు జరిగిందని చెప్పలేదని, ఇది తమకు చాలా బాధ కలిగించిందని ఆ సిస్టర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు గత 40 ఏండ్ల తమ సర్వీస్లో ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరుగలేదని ఎంబామింగ్ హెడ్ తెలిపారు. జరిగిన దానిపై వివరించి క్షమాపణ చెప్పేందుకు ప్రయత్నించామని చెప్పారు. అయితే ఇద్దరు సిస్టర్స్ దీనిని ఖండించారు. వారి నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదన్నారు.