కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్ల లక్ష్యంగా జలాలాబాద్లో వరుసగా రెండో రోజు కూడా పేలుళ్లు జరిగాయి. కాబూల్కు 80 మైళ్ల దూరంలోని నంగర్హార్ ప్రావిన్షియల్ రాజధాని జలాలాబాద్లో ఆదివారం బోర్డర్ పోలీస్ వాహనంపై ప్రయాణిస్తున్న తాలిబన్ల లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మరణించిన ఐదుగురిలో ఇద్దరు పౌరులు ఉన్నట్లు తెలుస్తున్నది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు ఏపీ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
కాగా, జలాలాబాద్లో తాలిబన్ వాహనాల లక్ష్యంగా శనివారం జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు తాలిబన్ ఫైటర్లతోసహా ముగ్గురు చనిపోగా 19 మంది గాయపడ్డారు. జలాలాబాద్పై పట్టు ఉన్న ఐఎస్ఐఎస్-కే తాలిబన్ లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్ట్ 25న కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబ్ పేలుడులో 60 మందికిపైగా మరణించారు. ఇది తమ పనేనని ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.