కరీంనగర్ : పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీనే ముఖ్యం. నాయకులు, కార్యకర్తలు ఎవరైనా పార్టీకి, క్రమశిక్షణను లోబడి పనిచేయాల్సిందేనన్నారు. పార్టీ వల్లనే నేడు పదవులు వచ్చాయి. పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణకు దశ, దిశ చూపించేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. ప్రతిపక్షాలకు రాజకీయాలే తప్ప ఎజెండా లేదు. అభివృద్దే సీఎం కేసీఆర్ ఎజెండా అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారశైలిపై హుజురాబాద్ మండలం సింగాపురంలోని తన నివాసంలో కెప్టెన్ లక్ష్మీకాంత రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ.. మంత్రిగా ఉంటూ 66 ఎకరాల అసైన్డ్ / ప్రభుత్వ భూమి ఈటల రాజేందర్ ఆక్రమించడం పద్దతి కాదు. దీనిపై కేసీఆర్ స్పందించారు. విచారణకు ఆదేశించారు. అది తప్పు ఎలా అవుతుంది? బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి భూములపై సొంత, వ్యక్తిగత లాభం కోసం కన్నేయడం తప్పు అన్నది ఒక మంత్రిగా ప్రాధమికంగా తెలుసుకోవాల్సిన అంశం. అవి ఎలాంటి భూములైన వాటి పరిధిలోని వెళ్లడం చట్ట వ్యతిరేకం. ఒకవైపు ఆర్డీవో కార్యాలయం హుస్నాబాద్లో ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు జరుగుతుండగా అక్కడ మంజూరైన ఆర్డీవో కార్యాలయాన్ని హుజురాబాద్కు తరలించే యత్నాలు ఈటల రాజేందర్ చేశారు. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయ ప్రారంభోత్సవానికి ఈటల హాజరు కాలేదు. ఈ విషయమై హుస్నాబాద్లో సందిగ్దత ఏర్పడింది.
హుజురాబాద్ ఎంపీపీగా ఉన్న వొడితల సరోజినీ దేవిపై అవిశ్వాసం పెడితే చూస్తూ ఉండిపోయావే తప్ప దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించి హుజురాబాద్, జమ్మికుంటలోని మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను ఈటల ప్రోత్సహించారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్నవారిని అణగదొక్కడం, బయటి వారిని ప్రోత్సహించడం చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి ఫోటోలు ఫ్లెక్సీల్లో పెట్టవద్దని హెచ్చరించేవారు.
నిజానికి టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం కేసీఆర్ ఆదేశాల మేరకు 2001లో అప్పటి కమలాపూర్ నియోజకవర్గంలో తమ ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పటి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని బలమైన పార్టీగా ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అవతరించింది. తదనంతరమే 2004 లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. సీఎం కేసీఆర్ పార్టీలో ఈటలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయన ఈ స్థాయికి ఎదిగింది కేసీఆర్ వల్లనే. సీఎం విశేష ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఈటల తీవ్ర అసంతృప్తితో రగిలి పోయారు. ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు.
ఏ దేశంలో లేని విధంగా రైతు బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రారంభించారు. ఐనప్పటికీ ఈ పథకాలపై వ్యతిరేక ధోరణితో ఈటల రాజేందర్ మాట్లాడారు. హుజురాబాద్లో క్లబ్ స్థలాన్ని కూడా ఆక్రమించాలని చూశాడు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని, పార్టీలో ఉంటూ సీఎం కేసీఆర్పై పార్టీ నాయకులపై విమర్శలు చేయడం అయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. సీఎం కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గోదావరి జలాలు తెలంగాణాలో పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.
ఈటలను కేసీఆర్ తన సొంత సోదరునిలా భావించారు. అప్పుడు మంత్రిగా ఉన్న ఈటల ఎన్ని నిధులు అడిగినా సీఎం ఇచ్చి అభివృద్ధిని ప్రోత్సహించారు. పార్టీలో ఉంటూ పార్టీని చీల్చే ప్రయత్నాలు చేయడం విడ్డూరం. ఈటల రాజేందర్ అత్యాశకు, దురాశకు పోయారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం చేయడం దారుణం. అందులో వాస్తవం ఏమాత్రం లేదని ఆయన పేర్కొన్నారు.