హైదరాబాద్ : బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికే బ్లాక్ ఫంగస్ సమస్య ఉందని డీఎంఈ తెలిపారు. బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారిలో ఈఎన్టీ సమస్యలు వస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ నిర్ధరణ అయిన బాధితులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామన్నారు. ఆప్తమాలజీ వైద్యుడి అవసరం ఉంటే సరోజిని దేవీ ఆస్పత్రిలో చికిత్స అందించనున్నారు. బ్లాక్ ఫంగస్కు వాడే ఔషధాలను సమకూర్చాలని టీఎస్ఎంఐడీసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మ్యూకోర్మికోసిస్నే సాధారణ పరిభాషలో బ్లాక్ ఫంగస్ అంటారు. ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే కొవిడ్ కారణంగా ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. గత రెండు రోజుల్లోనే ఈ బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న వాళ్లు ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నట్లు గంగారామ్ హాస్పిటల్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ మనీష్ ముంజాల్ వెల్లడించారు. గతేడాది కరోనా తొలిసారి వచ్చినప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అందులో చాలా మంది కంటిచూపు కోల్పోయిన వాళ్లు, ముక్కు, దవడ ఎముక తీసేయాల్సి వచ్చిన వాళ్లు ఉన్నట్లు డాక్టర్ మనీష్ తెలిపారు.
కొవిడ్ పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఎలా వస్తోందో ఇదే హాస్పిటల్ ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ స్వరూప్ చెప్పారు. కొవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను వాడటంతోపాటు డయాబెటిస్ (షుగర్) ఉన్న కొవిడ్ పేషెంట్లలో ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ అంతకుముందే డయాబెటిస్, కిడ్నీ, గుండె వైఫల్యాలు, క్యాన్సర్తో బాధపడుతూ కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు.
అందులోనూ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కొవిడ్ పేషెంట్లు ఈ బ్లాక్ పంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనిని త్వరగా గుర్తించడం అనేది చాలా ముఖ్యమని డాక్టర్ ముంజాల్ చెప్పారు. ముక్కులో అడ్డంకి, కళ్లు లేదా చెంపల్లో వాపు, ముక్కులో నల్లటి పొక్కుల్లాంటివి కనిపిస్తే వెంటనే బయాప్సీకి పంపించి యాంటీఫంగల్ థెరపీ చేయాలని సూచించారు.