కైరో : ఈజిప్టులోని సుయెజ్ జల సంధిలో భారీ కంటేనర్ నౌక చిక్కుకున్నది. సుయెజ్ కాలువలో నౌక అడ్డుతిరగడంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామైంది. ఆ కాలువ మార్గంలో వెళ్లాల్సిన చిన్న చిన్న సరుకు రవాణా బోట్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కంట్రోల్ తప్పడం వల్ల ఎవర్ గివన్ నౌక .. జలమార్గంలో అడ్డు తిరిగినట్లు తెలుస్తోంది. 400 మీటర్ల పొడుగు, 50 మీటర్ల వెడల్పు ఉంది ఆ నౌక. అయితే ఎవర్ గివన్ నౌక సుయెజ్ కాలువలో చాలా రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కాలువలో స్తంభించిన ఆ నౌకను పక్కకు జరిపేందుకు తగ్ బోట్లను పంపించారు. మధ్యదరా సముద్రం, ఎర్ర సముద్ర మార్గాన్ని సుయెజ్ కాలువ కలుపుతోంది. ఆసియా, యూరోప్ మధ్య సముద్ర మార్గాన్ని ఈ రూట్ తగ్గిస్తుంది. ఎవర్ గివన్ నౌక పనామాలో రిజిస్టరై ఉంది. నెదర్లాండ్స్లోని రోటర్డ్యామ్కు అది వెళ్తోంది. చైనా నుంచి వస్తున్న ఈ నౌక మధ్యదరా సముద్రానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తైవాన్కు చెందిన ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ ఈ నౌకను ఆపరేట్ చేస్తున్నది. అయితే బలమైన గాలులు వీయడం వల్ల నౌక జలమార్గానికి అడ్డు తిరిగినట్లు తెలుస్తోంది. ఒడ్డు వద్ద ఉన్న మట్టిని తాకిన ఆ నౌక అలాగే ఉండిపోయింది. ఎవర్ గివన్ నౌక దారిని క్లియర్ చేయాలంటే చాలా రోజుల పట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇంత పెద్ద భారీ సరుకుల నౌక ఈ మార్గంలో వెళ్లడం ఇదే తొలిసారి అని కొందరంటున్నారు.