నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందీగ్రామ్లో ఇవాళ జోరుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నందీగ్రామ్లోని ఓ పోలింగ్ బూత్ను ఇవాళ దీదీ విజిట్ చేశారు. బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి ఆమెపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తృణమూల్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు బయటివారన్నారు. వాళ్లంతా బీహార్, యూపీ నుంచి వచ్చారని, వారికి కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని సీఎం మమతా అన్నారు. నందీగ్రామ్ సమీపంలో ఉన్న బయాల్ గ్రామంలో దీదీ పర్యటించారు. వీల్చైర్పైనే ఆమె టూర్ చేశారు.
పోలింగ్ బూత్కు వెళ్లిన మమతా బెనర్జీ అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్తో మాట్లాడారు. గవర్నర్కు ఫోన్ చేసిన దీదీ.. స్థానిక ఓటర్లను అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి ప్రచారం నిర్వహిస్తున్నానని, స్థానిక ఓటర్లను వాళ్లు అడ్డుకుంటున్నారని, ఈ నేపథ్యంలో తమకు ఫిర్యాదు చేస్తున్నట్లు దీదీ ఫోన్లో తెలిపారు. ఈ విషయాన్ని మీరు గమనించాలని ఆమె కోరారు.