ఆదిశంకరాచార్యులు (సౌందర్యలహరి 16) అరుణ వర్ణంతో ప్రకాశించే భగవతిని ఉపాసించిన వారికి కవిత్వం అలవోకగా వస్తుంది. సభాసదులను తమ కవితాధారలతో మంత్రముగ్ధులను చేయగలుగుతారు. ‘అరుణాం కరుణా తరంగి తాక్షీం’. బాలభానుని లేత కిరణాల కాంతి స్వరూపిణిగా ఎవరైతే అమ్మను భావించి పూజిస్తారో వారి మనసులనే కమలముల వనం లేలేత భాస్కరుని కిరణాలకు తామరవనం వికసించిన విధంగా, అమ్మవారి కరుణా దృక్కులచే వికసించి, బ్రహ్మ ప్రేయసియైన సరస్వతి శృంగార లహరియై కవిత్వ రూపంలో ప్రవహిస్తుంది. ఆ కవిత్వం ఎలాంటి ప్రవాహం అంటే గంభీరమైన వాగ్విభూతి కలిగిన ‘తరుణతర శృంగార లహరీ’. పటుత్వమైన, శృంగార రసభావపూర్ణమైన కవిత్వ ప్రవాహమది. శృంగారం కాముకత కాదు. ధార్మికబద్ధమైన, భౌతిక జీవితానికి అతీతమైన, సత్యమైన, నిత్యమైన ఆనందానుభూతికి చెందిన భావాతీత స్థితికి తీసుకెళ్లే కవితాధార మాత్రమే. అది సహృదయ రంజకంగా, విజ్ఞానభరితమై, నిశ్రేయసానికి మార్గం చూపేదిగా సరసజ్ఞులను అలరిస్తుంది. అమ్మవారి సేవన వల్ల కవితామార్గంలో భౌతిక ప్రగతి, ఆధ్యాత్మిక సుగతి రెండూ సాధకునికి లభిస్తాయి. అమ్మవారిని ఆరాధించి పొందిన ఆమె కృపాకటాక్షాల వల్లే ఆదిశంకరులు 32 ఏండ్లే జీవించినా, ఎన్నో ఆధ్యాత్మిక రచనలు, భాష్యాలు, స్ర్తోత్రాలు రచించారు. అద్వైత మార్గాన్నీ చూపించారు. విద్యాహీనుడైన కాళిదాసు అమ్మవారిని ఉపాసించడం వల్లే అద్భుత కావ్యాలు రాయగలిగాడు. ఎవరైతే అరుణ వర్ణంలో ఉన్న అమ్మవారిని సరస్వతి రూపంలో ఆరాధిస్తారో వారిని అమ్మవారు ‘భ్రమరకీట న్యాయం’ ప్రకారం సరస్వతీ ప్రవాహంగా మారుస్తుంది. మంచి వాక్కు కావాలనుకునే వారు, ప్రతిభ కావాలనుకునే వారు అరుణ వర్ణంలో ఉండే అమ్మవారిని ధ్యానించాలని ఆదిశంకరులు చెప్తున్నారు. ‘అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వ త్కటీతటీ’. ‘ఎర్రని అద్దకంతో ఉన్న కౌసుంభ వస్త్రంచే కట్టబడిన కటితలంతో వెలిగే తల్లి లలితాదేవి’ అంటున్నది లలితా సహస్రనామం. అలాంటి స్వరూపాన్ని ధ్యానించి కవిత్వ దీప్తిని పొందవలసిందిగా చెప్తున్నారు శంకరులు. పరమేశ్వరి రూపమే వాక్కు. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరి అనే నాలుగు విధాలుగా వాక్కు ఉన్నది. పరాస్థానంలో వాక్కు పుడుతుంది, ఆలోచన పుడుతుంది. ఇది అవ్యక్తంగా ఉంటుంది. ఆత్మ స్థితియైన మౌనానికిది ప్రతీక. సాధారణంగా దీన్నెవరూ గుర్తించలేరు. తదుపరి అది ‘పశ్యంతీ’గా మారుతుంది. ఇక్కడ వాక్కు అస్పష్టంగా మారుతుంది. బుద్ధిగతమై యుక్తాయుక్త విచక్షణను కలిగి ఉంటుంది. పశ్యంతీ స్థానంలో ఆలోచనను సంస్కరించుకోగలుగుతాం. తదుపరి ‘మధ్యమా’గా స్పష్టాస్పష్టంగా ఉంటుంది. ఇక్కడ ఆకృతిని పొంది, విచక్షణారూపమై దర్శనమిస్తుంది. చివరగా వైఖరిగా శబ్దరూపంలో లోకాన్ని చూస్తుంది. ఇక్కడ స్పష్టతను సంతరించుకుంటుంది. వ్యక్తి సంస్కారం ఈ వైఖరి ద్వారా బయటకు వచ్చిన వాక్కుపై ఆధారపడి ఉంటుంది. సాధారణ మానవులు తమ పరిస్థితులను బాగు పరచుకునేందుకై ఇష్టపడతారే కానీ, తమ ఆలోచనల స్థాయిని మూలంలో మార్చుకునేందుకు ఇష్టపడరు. ఎప్పటిదాకా వారు ఆ పరిధిని దాటి రారో అప్పటివరకు వారి వాక్కులు బంధీలుగానే ఉంటాయి. అమ్మను ఆరాధించే సాధకుడు ఆమె అనుగ్రహంతో బంధనాలను త్రెంచుకొని, వాక్కును పరాస్థానంలోనే దర్శించి, ఆలోచనలను సంస్కరించుకోవాలి. అప్పుడు పటుత్వమైన, ప్రతిభాపూర్ణమైన, ప్రభావవంతమైన, రోచిష్మంతమైన వాక్కుపై అధికారాన్ని పొందుతాడు. వాక్కులో ప్రజ్ఞ ఆవిష్కృతమవుతుంది. అమ్మను దర్శించడం వల్ల భావదీప్తి చైతన్యవంతమై పాటవాన్ని ప్రదర్శిస్తుంది. భావం, భాష కలిసి అర్థవంతమైన, ఉదాత్తమైన కవిత్వంగా ఆవిష్కృతమవుతుంది.