న్యూఢిల్లీ, జూలై 2: భారత భద్రత వ్యవస్థకు డ్రోన్లు సవాల్ విసురుతున్నాయి. జూన్ 27న జమ్ములో భారత వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడి అనంతరం సరిహద్దుల్లో సైనిక స్థావరాలు, ఇతర ప్రాంతాల్లో డ్రోన్లు సంచరించడం తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. తాజాగా గురువారం ఉదయం 4.25 గంటల సమయంలో భారత్, పాక్ సరిహద్దులో ఆర్నియా సెక్టార్లో ఓ అనుమానాస్పద డ్రోన్ను బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. వెంటనే కాల్పులు జరిపాయి. ఇది పాకిస్థాన్కు చెందిన నిఘా డ్రోన్(క్వాడ్కాప్టర్) కావొచ్చని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత సరిహద్దులోకి ప్రవేశిస్తుండగా కాల్పులు జరిపామని, డ్రోన్ తిరిగి పాక్ సరిహద్దు లోపలికి వెళ్లిందని తెలిపారు. ఇదిలా ఉండగా, గతవారం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారత హై కమిషన్ కార్యాలయ భవనంపై, పరిసరాల్లో అనుమానాస్పదంగా ఓ డ్రోన్ సంచరించింది. దీనిపై భారతప్రభుత్వం, హై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికి భద్రతాలోపమేని కమిషన్ ఆరోపించింది. డ్రోన్ సంచారంపై దర్యాప్తు చేయాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. జమ్ములో దాడి కంటే ఒకరోజు ముందు జూన్ 26న ఈ డ్రోన్ కమిషన్ కార్యాలయం వద్ద సంచరించడం గమనార్హం. అయితే, భారత్ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. హైకమిషన్ కార్యాలయం పరిసరాల్లో డ్రోన్ సంచరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నది.
భద్రత వ్యవస్థపై నేరుగా ప్రభావం
జమ్ములోని వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి ‘చాలా తీవ్రమైనది, ఎంతో ప్రమాదకరమైనది’ అని బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ ఆస్థానా అన్నారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి తగిన సాంకేతికతను వీలైనంత వేగంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ సరిహద్దుల్లో సొరంగాలు, డ్రోన్ల వినియోగం పెరగడం భారత భద్రత వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. డ్రోన్లను కేవలం ఉగ్రవాదులే వాడతారని చెప్పలేమని, నక్సలైట్లు కూడా ఉపయోగించే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలపై కూడా పటిష్ఠ నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పాక్ హస్తం ఉండొచ్చు
జమ్ములో వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో పాక్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు. లష్కరే తాయిబా దాడి జరిపి ఉంటుందని అనుమానిస్తున్నట్టు చెప్పారు. లష్కరే పాక్ కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి దాడిలో ఆ దేశం హస్తం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను భారత్లోకి రవాణా చేయడానికి ఉగ్రవాదులు చాలా కాలంగా డ్రోన్లను వినియోగిస్తున్నారని, అయితే సాయుధ డ్రోన్లతో దాడి భారత భద్రత వ్యవస్థకు ‘చాలా తీవ్రమైన ముప్పు’ అని వ్యాఖ్యానించారు. కాగా, కేరళలోని తిరువనంతపురంలో డ్రోన్లపై పరిశోధనలకు గాను ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర డీజీపీ అనిత్ కాంత్ శుక్రవారం చెప్పారు. డ్రోన్ల ద్వారా ఎదురవుతున్న భద్రతా సమస్యలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర పోలీసులు కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు.