హయత్నగర్ : మద్యం కోసం డబ్బులిచ్చాడు ఓ చిరు వ్యాపారి. అయితే తిరిగివ్వాలని అడిగినందుకు ఘర్షణ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పనివాడిని హత్యకు కారణమైంది. కేసు వివరాలను హయత్నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్ ఆదివారం వెల్లడించారు. హయత్నగర్, అరుణోదయనగర్కు చెందిన పిసాటి సందీప్రెడ్డి(28) ప్రైవేట్ ఉద్యోగి. యాదాద్రిభువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, తుంబవి గ్రామానికి చెందిన పిసాటి ఉదయ్కిరణ్రెడ్డి అలియాస్ బాబి(29) వ్యాపారి, హయత్నగర్ రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన అత్తాపురం శ్రీకాంత్రెడ్డి(30) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరు ముగ్గరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఈనెల 25న రాత్రి ముగ్గురు కలిసి హయత్నగర్లోని శ్రీదుర్గా బార్లో మద్యం తాగారు.
సందీప్రెడ్డి మరింత మద్యం కావాలంటూ బ్లాక్లో కొనుగోలు చేయడానికి బార్ పక్కనే ఉన్న భారత్ బెంజ్ వెనుక బెల్టుషాపు వద్దకు వెళ్లి నాలుగు బీర్లను రూ.720కి కొనుగోలు చేశాడు. అతని వద్ద నగదు లేకపోవడంతో సదరు నిర్వాహకుడు గూగుల్పే చేయమని చెప్పగా పనిచేయలేదు. అదేసమయంలో భాగ్యలతకాలనీ కమాన్ సమీపంలోని పండ్ల వ్యాపారి సుభాష్ మద్యం కోసం బెల్టుషాపు వద్దకు చేరుకున్నాడు. తన వద్ద డబ్బులు లేవని, గూగుల్పే కూడా పనిచేస్తలేదని రూ.720 నగదును సుభాష్ వద్ద సందీప్రెడ్డి తీసుకున్నాడు. మద్యం తాగిన అనంతరం సుభాష్ తన డబ్బులు ఇవ్వాలని సందీప్రెడ్డిని అడిగాడు.
తన వద్ద డబ్బు లేదని, రేపు ఇస్తానని చెప్పడంతో సందీప్రెడ్డి బైక్ను సుభాష్ తన పండ్ల దుకాణం వద్దకు తీసుకెళ్లాడు. డబ్బులిచ్చి బైక్ను తీసుకెళ్లాలని తన పండ్ల దుకాణం వద్ద పనిచేసే కార్మికులకు అప్పగించి సుభాష్ వెళ్లిపోయాడు. కోపోద్రిక్తుడైన సందీప్రెడ్డి, తన స్నేహితులైన ఉదయ్కిరణ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డికి ఫోన్లో సమాచారం అందించగా దుకాణం వద్దకు చేరుకున్నారు. ఏపీ రాష్ట్రం, కర్నూల్ జిల్లాకు చెందిన దొడ్డ మధుసూదన్రెడ్డి(45), ఆనంద్, నర్సింహ పండ్ల బండి వద్దనే నిద్రిస్తున్నారు. సందీప్రెడ్డి, ఉదయ్కిరణ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి కార్మికులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.
కాగా వారు తప్పించుకొని పారిపోతూ క్రీడా ప్రహరీ వద్ద మధుసూదన్రెడ్డి అదుపు తప్పి కింద పడిపోగా సందీప్రెడ్డి, స్నేహితులతో కలిసి కర్రలతో అతని తలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో మధుసూదన్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. బాధితుడు నర్సింహ ఫిర్యాదు మేరకు హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ అభినందించారు.