కమ్మర్పల్లి/ఏర్గట్ల/ఆర్మూర్/నందిపేట్ రూరల్: జూన్ 20 : కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వనదేవత, పోచమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు కురవాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వీడీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సభ్యులు పాల్గొన్నారు. బషీరాబాద్లో వీడీసీ ఆధ్వర్యంలో ఊరపండుగను నిర్వహించారు. ప్రజలు, పంటలు, పశువులు బాగుండాలని పూజలు చేశారు. సర్పంచ్ సక్కారం అశోక్, వీడీసీ అధ్యక్షుడు పిట్ల సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లిలో ముదిరాజ్ నాగండ్ల సంఘం సభ్యులు సమృద్ధిగా వానలు కురవాలని గ్రామ దేవతలకు ఆదివారం పూజలు చేశారు.
చెరువులు, కుంటలు నిండాలని, మూడు పంటలు పండాలని, కరోనా మహమ్మారి అంతం కావాలని కోరుతూ కమ్మర్పల్లిలోని పెద్దమ్మ, ముత్యాల పోచమ్మ, భీమన్న, సార్గమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. కుటుంబసభ్యులతో వన భోజనాలకు వెళ్లారు. ఏర్గట్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక భీమన్న స్వామి ఆలయం వద్ద, మండలంలోని బట్టాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు గంగాజలంతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ సర్వసమాజ్ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు ఆదివారం భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేశారు. సర్వసమాజ్ ప్రతినిధులు ఉద యం భక్తిశ్రద్ధలతో శ్రీరాంసాగర్ గంగానదికి తరలివెళ్లి జలాలను తీసుకొచ్చి ఆర్మూర్ పొలిమేరల్లో ఉన్న గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు.
ఆర్మూర్ సర్వసమాజ్ అధ్యక్షుడు గుండేటి మహేశ్రెడ్డి, కార్యదర్శి మధు, సర్వసమాజ్ సభ్యులు, ఆర్మూర్ పట్టణ సదర్లు, ఆర్మూర్ సొసైటీ వైస్చైర్మన్ నర్మె నవీన్ పాల్గొన్నారు. నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామంలో గ్రామ దేవతలకు వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది సైతం వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. మారంపల్లి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఊరు పండుగ నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.