న్యూఢిల్లీ : భారత్ లో అధికారికంగా వెల్లడించిన కొవిడ్-19 మరణాల కంటే ఆరేడు రెట్లు అధికంగా మహమ్మారి బారినపడి ప్రజలు మరణించారన్న న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం తోసిపుచ్చింది. ఈ కథనం ఊహాజనితమని, తప్పుడు సమాచారంతో కూడినదని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఐసీఎంఆర్ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొవిడ్-19 మరణాలను నమోదు చేస్తున్నాయని, రోజూ జిల్లాల వారీ కేసులు, మరణాలను మదింపు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భారత్ లో అధిక మరణాలపై న్యూయార్క్ టైమ్స్ కథనం నిరాధారమైనదని పేర్కొంది. అంటువ్యాధుల వ్యాప్తిపై ఎలాంటి ఆధారాలు లేకండా అడ్డదిడ్డమైన డేటాతో కథనాన్ని వండివార్చారని ఆక్షేపించింది. కాగా, భారత్ లో అధికారిక గణాంకాల ప్రకారం మూడు లక్షల మంది కరోనా వైరస్ బారినపడి మరణించగా వాస్తవంగా ఆరు లక్షల నుంచి 42 లక్షల మంది వరకూ చనిపోయి ఉంటారని ఆ పత్రిక మే 25న ప్రచురించిన కథనంలో పేర్కొంది. భారత్ లో 2.7 కోట్ల మందికి ఇప్పటివరకూ కొవిడ్-19 సోకగా ఈ సంఖ్య 40 నుంచి 70 కోట్ల వరకూ ఉంటుందని వ్యాసకర్తలు లజరొ గమియో, జేమ్స్ గ్లాంజ్ రాసుకొచ్చారు.