గృహ రుణ వడ్డీరేటు పెంపు
ఏప్రిల్ 1 నుంచి 6.95% అమలు
ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ అదనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఇంటి కోసం రుణం తీసుకోవాలని భావిస్తున్నవారికి చేదువార్త. దేశీయ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును 6.95 శాతానికి (25 బేసిస్ పాయింట్లు) పెంచింది. కొత్త వడ్డీ రేటు వెంటనే అమల్లోకి వస్తుందని ఆ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎస్బీఐ రూ.75 లక్షల్లోపు గృహ రుణాలపై 6.70 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల రుణాలపై 6.75 శాతం చొప్పున వడ్డీ వసూలు చేసిన విషయం విదితమే. ఈ పరిమిత కాల ఆఫర్ మార్చి 31తో ముగిసిందని, ఏప్రిల్ 1 నుంచి 6.95 శాతం వడ్డీ రేటు అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తన వెబ్సైట్లో వెల్లడించింది. అంతేకాకుండా ఇకమీదట గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజుతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా వసూలు చేస్తామని పేర్కొన్నది. రుణ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతం మేరకు ఉంటుందని, అలాగే కనీసం రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.30 వేల వరకు జీఎస్టీ వసూలు చేస్తామని వివరించింది. దీంతో ఎస్బీఐ మాదిరిగా ఇతర బ్యాంకులు కూడా తమ గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి..
హైదరాబాద్లో ఇండ్లకు భలే గిరాకీ
మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్బై