న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్ కేసులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మే 7వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగించింది. ప్రస్తుతం భోపాల్, ఇండోర్తో పాటు ప్రముఖ నగరాలు సహా పలు జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం శివరాజ్సింగ్ కొవిడ్ పరిస్థితిపై సమీక్షించారని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. కర్ఫ్యూపై ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకునేందుకు జిల్లాస్థాయి కమిటీలకు అధికారం ఇచ్చినట్లు తెలిపారు. పది జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని, మరో 13 ఇతర జిల్లాల్లో స్థిరంగా ఉందని మిశ్రా చెప్పారు.
ఆరు జిల్లాల్లో 50 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని, మూడు జిల్లాల్లో వైరస్ను సమర్థవంతంగా అరికట్టినట్లు పేర్కొన్నారు. ఇండోర్, భోపాల్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిని సహా కొన్ని జిల్లాల్లో విస్తరిస్తున్న వైరస్ ఆందోళన కలిగిస్తోందని, పరిస్థితిపై సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నివారి, డాటియా జిల్లాల నుంచి బస్సు సర్వీసులను నిలిపివేసేందుకు చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల్లో రాష్ట్రానికి 29 ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకుంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో బుధవారం 12,758 కొవిడ్ కేసులు నమోదవగా.. 105 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం తెలిపింది.