హనోయి: అతడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 41 ఏళ్ల పాటు అడవిలోనే గడిపాడు. రియల్ లైఫ్ టార్జాన్( Real Life Tarzan )గా పేరు సంపాదించాడు. చివరికి ఇప్పుడు 52 ఏళ్ల వయసులో కాలేయ క్యాన్సర్తో కన్నుమూశాడు. హో వాన్ లాంగ్ అనే ఈ వియత్నాంకు చెందిన వ్యక్తి 8 ఏళ్ల కిందటే నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది? అతడు అన్నేళ్లపాటు అడవిలో ఎందుకు గడిపాడు?
ఎవరీ హో వాన్ లాంగ్?
1972లో వియత్నాంపై అమెరికా యుద్ధం చేసిన సంగతి తెలుసు కదా. ఆ యుద్ధంలో అమెరికా వేసిన ఓ బాంబు హో వాన్ లాంగ్ ఉంటున్న ఇంటిపై పడింది. ఈ ఘటనలో అతడి తల్లి, ఇద్దరు తోబుట్టువులు మరణించారు. ఇక అప్పటి నుంచీ లాంగ్ అక్కడి కువాంగ్ ఎన్గాయ్ ప్రావిన్స్లోని టే ట్రా జిల్లాలో ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లిపోయాడు. అతనితోపాటు తండ్రి, మరో సోదరుడు కూడా ఉన్నారు. 41 ఏళ్ల పాటు వాళ్లు అలా అడవిలోనే ఉన్నారు.
2013లో అతని తండ్రి హో వాన్ థాన్ ఆరోగ్యం క్షీణించిన సందర్భంలో అతడి పెద్దన్న హో వాన్ ట్రి వినతి మేరకు లాంగ్, అతడి తండ్రి తిరిగి నాగరిక ప్రపంచంలోకి వచ్చారు. 2013లోనూ ఓ గ్రామంలో వాళ్లు అడుగుపెట్టినప్పుడు కూడా యుద్ధం ఇంకా కొనసాగుతోందని వాళ్లు భావించారు. ఆ తర్వాత 2017లో అతని తండ్రి మరణించాడు.
ప్రాణం తీసిన ఆధునిక జీవనశైలి
నాలుగు దశాబ్దాల పాటు అడవిలో ప్రకృతితో మమేకమై ఎంతో నాణ్యమైన జీవితాన్ని గడిపాడు హో వాన్ లాంగ్. కానీ ఎప్పుడైతే నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టాడో అప్పటి నుంచీ ఆధునిక జీవనశైలికి అలవాటు పడినట్లు లాంగ్ స్నేహితుడు అల్వారో సెరెజో చెప్పాడు. ఇది అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అతను అన్నాడు. ఆల్కహాల్ తాగడం, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం లాంగ్ ఆరోగ్యాన్ని క్షీణించేలా చేసింది. ఆ జీవనశైలే చివరికి అతన్ని లివర్ క్యాన్సర్ బారిన పడేలా చేసి ప్రాణం తీసింది.