న్యూఢిల్లీ : భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ టీకాకు త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి దక్కనున్నది. అత్యవసర వినియోగ జాబితాలో కోవాగ్జిన్ను చేర్చేందుకు డబ్ల్యూహెచ్వో సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 4 నుంచి ఆరు వారాల్లోగా లేదా ఆగస్టు తొలి వారంలో కోవాగ్జిన్ టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నది. తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ ఇప్పుడిప్పుడే కోవాగ్జిన్కు సంబంధించిన డేటాను తన పోర్టల్లో అప్లోడ్ చేస్తోందని, ఆ డేటాను సమీక్షిస్తున్నామని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెబినార్లో ఆమె దీని గురించి మాట్లాడారు.
డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాల ప్రకారం .. ఎమర్జెన్సీ అనుమతి జాబితా కోసం వ్యాక్సిన్ స్టడీ చేస్తున్నట్లు సౌమ్య తెలిపారు. కొత్త ఉత్పత్తులు లేదా లైసెన్సు లేనటువంటి ఉత్పత్తుల వినియోగం కోసం అత్యవసర అనుమతి విధానాలను పాటిస్తుంటారు. అయితే వ్యాక్సిన్ల విషయంలో మూడవ దశ ట్రయల్స్ పూర్తి కావాలని, దానికి సంబంధించిన డేటా వచ్చిన తర్వాత నిపుణుల సలహా మండలి నిర్ణయం తీసుకుంటుందని స్వామినాథన్ తెలిపారు. డేటా సంపూర్ణంగా ఉండాలని, వ్యాక్సిన్ రక్షణ, సామర్థ్యం, ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తారన్నారు. భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను ప్రజెంట్ చేసిందని, మరో నాలుగు నుంచి ఆరు వారాల్లోగా ఎమర్జెన్సీ వాడకం జాబితాలో కోవాగ్జిన్ చేరుతుందని సౌమ్య వెల్లడించారు.
ఫైజర్, ఆస్ట్రాజెనికా, జాన్సన్, మోడెర్నా, సైనోఫార్మ్, కోవీషీల్డ్ టీకాలకు ఇప్పటికే డబ్ల్యూహెచ్వో అత్యవసర అనుమతి ఇచ్చింది. 105 రకాల టీకాలకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, దాంట్లో 27 టీకాలు మూడవ, నాలుగవ దశలో ఉన్నట్లు ఆమె చెప్పారు. ప్రీ క్లినికల్ పరీక్షల్లో మరో 184 వ్యాక్సిన్లు ఉన్నట్లు సౌమ్య తెలిపారు.