యాదాద్రి, మే12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్యపూజలు నిరాడంబరంగా కొనసాగాయి. కరోనా సెంకడ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ ప్రకటించింది. దీంతో స్వామివారి ఆలయ దర్శనాలు, ఆర్జిత సేవలు, స్వామివారి గర్భగుడి దర్శనాలు రద్దు చేశారు. ఆలయంతో పాటు కొండపైకి సైతం అనుమతిని ఇవ్వడం లేదు. లక్ష్మీనరసింహస్వామివారి సమయంలో కేవలం ఆలయ ప్రధానార్చకులు, ఉప అర్చకులచే నిత్యపూజలు, నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులను సైతం విడుతల వారీగా విధులకు అనుమతి ఇచ్చారు. స్వామివారి ఆలయ బాలాలయంతోపాటు ఆలయ ప్రాంగణాలను పూర్తిగా బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేశారు. ఆలయ అనుబంధంగా ఉండే గోశాలలో గోవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది పశుగ్రాసాన్ని అందజేశారు.
స్వామివారికి ఏకాంత సేవలు
ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలోయాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అర్చకులు ఏకాంత సేవలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహచార్యులతో పాటు ఇతర అర్చకులు, ఆలయ అధికారులు మాత్రమే స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. ఉదయమే స్వామివారి సుప్రభాతం సేవలు నిర్వహించి వేకువజామునకే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు, శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తర సేవలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని ఆలయ ప్రధానార్చకుడు తెలిపారు. భక్తుల రద్దీ మినహా స్వామివారికి జరగాల్సిన రాజోపచారాలు యథాప్రకారం జరుగుతున్నాయి. మూలస్థానమైన పాతగుట్టలో స్వామివారి రాజోపచారాలు సైతం శాస్ర్తోక్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు. భక్తులచే జరుపబడే ఆర్జిత సేవలైన అష్టోత్తర సేవ, నిత్యకల్యా ణం, సువర్ణపుష్పార్చన,లడ్డూ, పులిహోర టికెట్లను లెక్కించి విక్రయాలు నిలిపివేశారు.
గోశాలకు లక్ష విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి గోశాలలో ఉన్న గోమాత పసుగ్రాసం నిమిత్తం పలువురు దాతలు ముందుకు వచ్చారు. హైదరాబాద్కు చెందిన పెసరి సుజాత రూ. లక్షను గోమాతలకు విరాళంగా అందజేశారు.
ఉత్తర్వులు వచ్చే వరకూ కొనసాగింపు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అంతరంగికంగా స్వామివారి సేవలు, నిత్య కల్యాణం, కైంకర్యాలు కొనసాగించేలా అన్ని చర్యలు చేపట్టాం. ఉద్యోగులను ఉదయం, సాయంత్రం విడుతల వారీగా విధుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజూ ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో దేవాదాయశాఖ ఆదేశాలనుసారం ఆలయంలోకి భక్తులను అనుమతి ఇవ్వడం లేదు. ఆలయంలో ఆర్జిత సేవలు, భక్తుల ప్రవేశం, స్వామివారి గర్భగుడి దర్శనం రద్దు చేశాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ తాజా మార్పులు కొనసాగుతాయి.
-ఎన్. గీత, కార్యనిర్వహణాధికారి, యాదాద్రి దేవస్థానం
భక్తజన సంరక్షణకోసమే..
కలియుగాంతం వరకు ఏ నక్షత్రంలో ఏ పూజలు జరుగాలో ఆదే రీతి లో ఆగమశాస్త్రం ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. భక్తుల క్షేమం కోసమే ప్రతి రోజూ కరోనా ప్రాణినాం… ప్రజానాం.. భక్త నాం.. సర్వవిధ పరిక్షరణార్థం సుదర్శననారసింహ హోమం నిర్వహిస్తున్నాం. ధన్వంతరి స్వరూపమైన లక్ష్మీనరసింహస్వామి మూలమంత్రాలతో హోం జరుపుతున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో భక్తుల ప్రమే యం లేకుండా సుప్రభాతం మొదలుకొని పవళింపుసేవ వరకు రాజోపచారాలు యథాప్రకారం జరుగుతున్నాయి. మూలస్థానమైన పాతగుట్టలో సైతం స్వామివారి రాజోపచారాలు శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయి.
-నల్లంథీగళ్ లక్ష్మీనరసింహచార్యులు, ప్రధానార్చకుడు, యాదాద్రి దేవస్థానం