తొమ్మిది నెలల్లో 40 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఇవి 40 శాతం వృద్ధిచెంది 51.47 బిలియన్ డాలర్ల (రూ.3,74,483 కోట్ల)కు చేరాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో వచ్చిన 55.14 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 22 శాతం అధికంగా (67.54 బిలియన్ డాలర్ల) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఎఫ్డీఐలు 37 శాతం (26.16 బిలియన్ డాలర్లకు), డిసెంబర్లో 24 శాతం (9.22 బిలియన్ డాలర్లకు) పెరిగినట్లు వివరించింది. గత ఆరున్నర ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధాన సంస్కరణలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం లాంటి చర్యలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదలకు దోహదం చేశాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.