20వేల లీటర్ల ‘ఉచిత నీటి సరఫరా పథకం’ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ పథకానికి అర్హులైన వారు క్యాన్ నంబర్తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. కానీ నగరంలో గత కొద్ది రోజులుగా కొంత మంది వినియోగదారులకు ఆధార్ అనుసంధాన సమయంలో ఓటీ పీ రావడం లేదు. దీంతో వాళ్లు అయోమయంలో పడ్డారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదులు జలమండలి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఓటీపీ రాని వినియోగదారుల నుంచి బయోమెట్రిక్ స్వీకరించి ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు కూడా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఈ ప్రక్రియలో మరింత వేగం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఒక వ్యక్తికి నగరంలో ఒకటికి మించి ఇండ్లు ఉన్నైట్లెతే ఉచిత నీటి సరఫరా పథకం ఒక ఇంటికి మాత్రమే వర్తిస్తుందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఒక వ్యక్తికి ఒకే అపార్ట్మెంట్లో ఒకటికి మించి ప్లాట్లు ఉంటే.. ఒకే ప్లాటుకు ఆధార్ అనుసంధానం చేయాలని మిగిలిన ప్లాటుకు మాత్రం నీటి వినియోగాన్ని బట్టి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మీటర్లు లేని ఇంటి యజమానులు వెంటనే మీటర్లు బిగించుకొని క్యాన్ నంబర్లతో ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు.