న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అఫ్గానిస్థాన్లో ఇటీవలి పరిణామాలు భారత్లాంటి పొరుగుదేశాలపై అధిక ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ అన్నారు. అఫ్గాన్లో అస్థిరత ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద, ఉగ్రవాద భావజాలాలకు ప్రోత్సాహం లభిస్తుందని, ఇతర తీవ్రవాద గ్రూపులు కూడా హింస ద్వారా అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వర్చువల్ పద్ధతిలో జరిగిన ఎస్సీవో వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గాన్లో అధికార మార్పిడి ఎలాంటి సంప్రదింపులు లేకుండా జరిగిందని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఏర్పాటైన తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. మధ్య ఆసియాలో పెరుగుతున్న ఛాందసవాదం, తీవ్రవాదం ఆ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించాయని అన్నారు. వీటిపై యుద్ధానికి షాంఘై సహకారం సంస్థ (ఎస్సీవో) ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పిలుపునిచ్చారు. మధ్య ఆసియాకు, భారత దేశానికి మధ్య అనుసంధాన వ్యవస్థ పెరుగాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్లో నిర్మిస్తున్న చాబహార్ పోర్టుతో ఇది వాస్తవ రూపం దాలుస్తుందన్నారు. దేశాల మధ్య సంప్రదింపులు జరిపి పారదర్శకంగా అనుసంధాన ప్రాజెక్టులు నిర్మించాలని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నారు. మోదీ పరోక్షంగా చైనా చేపట్టిన వన్ బెల్డ్ వన్ రోడ్ ప్రాజెక్టుపై ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు
అఫ్గానిస్థాన్లో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు లేకుండా, స్వతంత్ర, ప్రజాస్వామిక, శాంతియుత, తటస్థ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని ఎస్సీవో సభ్య దేశాలు తీర్మానం చేశాయి. ఎస్సీవో సభ్య దేశాల పరిధిలో శాంతిభద్రతలు, స్థిరత్వం కొనసాగాలంటే అఫ్గాలో పరిస్థితులు వెంటనే చక్కబడాలని అభిప్రాయపడ్డాయి.
ఒక్కరోజులో 2.5 కోట్ల టీకా డోసులు
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేళ కరోనా వ్యాక్సినేషన్లో కొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా 2.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ఆగస్టు 31న 1.3 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేయగా ఇప్పటివరకు అదే రికార్డుగా ఉంది. అంతకుముందు ఆగస్టు 27న ఒక్కరోజులో వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య తొలిసారిగా కోటి మార్కు దాటింది. నెల రోజుల వ్యవధిలో నాలుగుసార్లు ఈ మార్కు దాటినట్టు అధికార వర్గాలు తెలిపాయి.