ఐరాస: కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచదేశాలు ఇప్పటివరకు నిర్దేశించుకొన్న లక్ష్యాలను బట్టి చూసినా ఈ శతాబ్దం చివరికి భూతాపం 2.7 డిగ్రీలకు పెరుగుతుందని ఐరాస వాతావరణ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ తన నివేదికలో హెచ్చరించింది. భూతాపం పెరగకుండా ఆపడానికి ఇంకా ప్రభావవంతమైన చర్యలు అవసరమని సూచించింది. భూతాపాన్ని నిరోధించడంలో ఒక్కో దేశం ఒక్కో తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయి. కాలుష్య కారకాలను ఎంతమేర తగ్గించాలన్నదానిపై సొంతంగా లక్ష్యాలను నిర్దేశించుకొన్నాయి. అయితే ఇవి పారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపోవని ఐరాస తెలిపింది. భూతాపం ఇప్పటికే 1.2 డిగ్రీలకు చేరిందని పేర్కొన్నది.
కర్బన ఉద్గారాలు సగం తగ్గాలి
2050నాటికి ప్రపంచం కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలంటే ప్రస్తుతం వెలువడుతున్న కర్బన ఉద్గారాలను 2030 నాటికి 45%మేర తగ్గించాలి. ప్రస్తుతం దేశాలు సొంతంగా పెట్టుకొన్న లక్ష్యాలను బట్టి 2030నాటికి కర్బన ఉద్గారాలు సగానికి తగ్గకపోగా 16% పెరుగుతాయి. ఫలితంగా శతాబ్దాంతానికి భూతాపం 2.7డిగ్రీలకు పెరుగనుంది.
పేద దేశాలకు సాయం చేయండి
నివేదికపై యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. ‘భూమి సర్వనాశనం వైపు పయనిస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. ‘పారిస్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాం. వనరులు ఉన్నా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం అవుతున్నాం. సమయం మించిపోతున్నది. ఎంతో మంది ప్రజలకు, జీవజాతులకు ముప్పు ఉన్నది’ అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. పారిస్ ఒప్పందానికి కట్టుబడేలా ప్రతీ దేశం తమ సొంత వాతావరణ లక్ష్యాలను నిర్దేశించుకొని, అమలు చేయాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు సాయం చేయాలని కోరారు.